యాంకర్ నిరోషా అత్మహత్యలో ట్విస్ట్: నాన్న మాట ఇదీ
హైదరాబాద్: జెమినీ మ్యూజిక్ ఛానల్ యాంకర్ నిరోషా (23) ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తన కుమార్తెకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేదని, బుధవారం తెల్లవారుజామున భరించలేని కడుపు నొప్పి రావడంతోనే ఆత్మహత్య చేసుకుందని నిరోషా తండ్రి రాధాకృష్ణ అన్నారు.
పోలీసుల విచారణలో ఇదే విషయాన్ని కాబోయే భర్త రిత్విక్ కూడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. యాంకర్గా అనతికాలంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నిరోషా సికింద్రాబాద్లో సింధి కాలనీలోని పీజీ హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది?: ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్
మంగళవారం విధులు ముగించుకొని బయటకు వచ్చిన నిరోషా రాత్రి 9 గంటలకు హాస్టల్కు చేరుకుంది. రాత్రి 9.45 గంటలకు అందరితో కలిసి భోజనం చేసిన ఆమె రూం నంబర్ 105లోకి వెళ్ళింది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తండ్రి రాధాకృష్టతో మాట్లాడింది. అనంతరం రాత్రి 11 గంటల సమయం కెనడాలో ఉంటున్న కాబోయే భర్త రుత్విక్తో ఫోన్లో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది.
ఈ వీడియో కాల్ సంభాషణ జరుగుతుండగానే రుత్విక్తో మాట్లాడున్న నిరోషా తాను కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నానని, దానిని భరించలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా తనకు కడుపు నొప్పి వస్తుండేదని, తన సమస్యకు పరిష్కారం లభించడం లేదని బాధపడుతూ రుత్విక్కు చెప్పింది.
నా సమస్యకు ఆత్మహత్యే సరైన పరిష్కారమని తన చున్నీతో ఉరేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రిత్విక్ ఫోన్లో ఆత్మహత్య చేసుకోవద్దంటూ వారిస్తున్నా వినకుండా వీడియో కాల్ను కట్ చేసింది. ఈ సమయంలో నిరోషా ఆత్మహత్యకు పాల్పడుతుందని జూబ్లిహిల్స్లో ఉన్న చుట్టాలకు ఫోన్ చేసి వారి సాయాన్ని సైతం రిత్విక్ కోరాడు.
రాత్రి 12.30 గంటలకు నిరోషా స్నేహితురాలు హాస్టల్కు చేరుకొని జరిగిన విషయాన్ని వార్డెన్ సంధ్యకు వివరించింది. వెంటనే హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిరోషా గది తలుపులు పగులగొట్టి చూడగా నిరోషా అప్పటికే మరణించింది.
కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా.. (ఫోటోలు)
దీంతో వెంటనే నిరోషా మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. నిరోషా గది నుంచి పోలీసులు కడుపు నొప్పికి సంబంధించిన టాబ్లెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబసభ్యులు, స్నేహితులు, వార్డెన్ నుంచి వివరాలు సేకరించారు. నిరోషా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని మల్లేశ్వరం గ్రామంలో నివసిస్తున్నారు. తన కుమార్తె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో ఆ కుటుంబ మొత్తం విషాదంతో మునిగిపోయింది.