ఉరేసుకొని టెక్కీ ఆత్మహత్య, కామవాంఛ తీర్చలేదని మహిళపై రేప్, హత్య
హైదరాబాద్: అనారోగ్యం కారణంగా మనస్తాపం చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ టెక్కీగా పని చేస్తూ బాగ్ లింగంపల్లి ప్రాంతంలో భార్యతో కలిసి ఉంటున్నాడు.
కొద్ది రోజులుగా మెడ, నడుము నొప్పితో అతను బాధపడుతున్నాడు. మహేష్ భారర్య నిజామాబాదులోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో మహేష్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి గదిలో నుంచి దుర్వాసన వచ్చింది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా మహేష్ మృతి చెంది కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మహిళపై అత్యాచారం, హత్య
ఓ మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1200, బంగారు నగలు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహం ఈ నెల 5న లభ్యమైంది.
గుల్బర్గాకి చెందిన నగేష్ (35) కూలీ. కొంతకాలంగా పహాడీ షరీఫ్లోని రౌషన్ దౌలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లా రేమద్దులకు చెందిన మహిళ ఇదే ప్రాంతంలో నివసిస్తోంది. పళ్ల వ్యాపారం చేసుకునే ఆ మహిళతో సంవత్సరం క్రితం నగేష్కు పరిచయం ఏర్పడింది.
ఈ నెల 4రాత్రి వారిద్దరూ రౌషన్ దౌలా ప్రాంతంలో వస్తుండగా తన కామ వాంఛ తీర్చాలని ఆ మహిళను కోరాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా అత్యాచారం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె చీర కొంగును మెడకు బిగించి హతమార్చాడు. మృతురాలికి చెందిన నగలు, రూ.6 వేలు, సెల్ ఫోన్ తీసుకున్నాడు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పరారయ్యాడు.