టీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరు, 2019లోనే మార్పు, ప్రజలంతా బీజేపీవైపే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: రానున్న రెండేళ్లు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎంతో కీలకమైనవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఆ మార్పు బీజేపీతోనే మొదలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకే బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
టీఆర్ఎస్ తన ప్రయత్నం చేస్తుంది కానీ..
హైదరాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయిలో రాజకీయ పోరాటాలు, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రక్రియలో బీజేపీని అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ తన ప్రయత్నం చేస్తుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
టీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు..
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించే విధంగాప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా పోరాటాలు సాగించాలన్నారు కిషన్ రెడ్డి. రెండు స్థానాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
అదే జరగకుంటే టీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు కూడా కష్టమే
మజ్లిస్ పార్టీతో స్నేహం లేకపోయుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు కూడా టీఆర్ఎస్ గెలిచేది కాదని కిషన్ రెడ్డి చెప్పారు. ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగానే టీఆర్ఎస్ 50కిపైగా స్థానాల్లో గెలవగలిగిందన్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయన్నారు కేంద్రమంత్రి.
మార్పు అప్పుడే మొదలైంది కానీ..
గత పార్లమెంటు ఎన్నికల్లోనే మార్పు ప్రారంభమైందని, అయితే ఆ విషయాన్ని ఏ రాజకీయ పార్టీ గ్రహించలేకపోయిందన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం కారణంగానే హైదరాబాద్లో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోలేకపోయిందన్నారు. మరో 15 రోజుల తర్వాత న్యాయబద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి ఉంటే మేయర్ పీఠం బీజేపీకే దక్కేదన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.