హైదరాబాద్ మాదాపూర్లో కారు బీభత్సం... పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి...
హైదరాబాద్లోని మాదాపూర్లో శనివారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా... అందులో ఒకరు ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపిన వ్యక్తిని విద్యుత్ శాఖ డీఈ నరేందర్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాద ఘటన అనంతరం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో వెళ్లి లొంగిపోయారు.నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడి మృతి :
రంగారెడ్డి జిల్లా షాబాద్లో విషాదం చోటు చేసుకుంది.స్థానిక సీఐ అశోక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాబాద్కు చెందిన బైండ్ల యాదయ్య (30) మరో ఇద్దరితో కలిసి మరియాపురంలో జరిగిన ఓ ఫంక్షన్కు వెళ్లాడు. అక్కడినుంచి తిరిగి ఇంటికి వస్తుండగా... స్నేహితులతో కలిసి సరదాగా పహిల్వాన్ చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు.అయితే యాదయ్యకు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీశారు. మృతుడి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.