హైదరాబాద్లో నేరాలు-టెక్నాలజీ: హడలెత్తిస్తున్న పోలీసులు
అగ్ర దేశాలకు దీటైన టెక్నాలజీ హైదరాబాద్ పోలీసుల వద్ద ఉంది. లక్షకు పైగా సీసీ కెమెరాలు, సీసీఎస్ నేతృత్వంలో 30 కోట్ల విలువైన సైబర్ ల్యాబ్.
హైదరాబాద్: అగ్ర దేశాలకు దీటైన టెక్నాలజీ హైదరాబాద్ పోలీసుల వద్ద ఉంది. లక్షకు పైగా సీసీ కెమెరాలు, సీసీఎస్ నేతృత్వంలో 30 కోట్ల విలువైన సైబర్ ల్యాబ్, నేరస్తుల డేటా బేస్, నేరస్తుల ముఖాలను గుర్తించే కెమెరాలు, ప్రతి వాహన ప్లేట్ను రికార్డ్ చేసే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేజేషన్ వంటి టెక్నాలజీని నగర పోలీసులు సమకూర్చుకున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో నేరస్తులు తప్పించుకోలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా చిక్కకుండా తప్పించుకుంటున్న ముఠాలు హైదరాబాద్లో పట్టుబడుతున్నాయి. నేరం ఏదైనా సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్ పోలీసులు నేరస్తులను పట్టుకుంటున్నారు.
హైదరాబాద్ అంటే జడుసుకుంటున్నారు
నేరస్థులు కమ్యూనికేషన్ కోసం సెల్ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడుతారు. వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ చేయాలంటే లాగిన్ అవ్వటం తప్పనిసరి. నిందితులు ఎక్కడ లాగిన్ అయ్యారో తెలుసుకోవటంలో పోలీసుల దగ్గర ఉన్న టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ టెక్నాలజీతోనే పూర్తి ఆధారాలు సేకరించి, వాటినే కోర్టులో సాక్ష్యాలుగా చూపి శిక్షపడేలా ఉచ్చు బిగిస్తున్నారు. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు, సైబర్ నేరస్థులు హైదరాబాద్లో జడుసుకుంటున్నారు.
కొందరు తాత్కాలిక సిమ్లు వాడినా
నేరస్తులను గుర్తించడంలో కీలకమైన కాల్ డేటా విశ్లేషణ. టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ను వివిధ ఫార్మాట్లలో అందించేది కాల్ డాటా అనాలసిస్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది డాటా, వీడియోలు, మ్యాప్ల రూపంలో అందిస్తుంది. నేరస్తులు కొందరు ఇతరుల లేదా తాత్కాలిక సిమ్ కార్డులు వాడుతారు. వాటిని కూడా విశ్లేషించే సామర్థ్యం ఉంది. సిమ్ కార్డులు, హార్డ్ డిస్క్లు పగులగొట్టినా డాటాను సేకరించే టెక్నాలజీ ఉంది.
లక్ష సీసీ కెమెరాలు
హైదరాబాదులో దాదాపు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎనభై వేలకు పైగా కెమెరాలకు జియో ట్యాగింగ్ చేశారు. హైదరాబాదులోకి ఓ వ్యక్తి లేదా వాహనం వస్తే అధి రికార్డు అవుతుంది. నేరస్తులను గుర్తించే ఫేసియల్ రికగ్నైజేషన్ పోలీసులను అలర్ట్ చేస్తుంది.
వారిని అత్యాధునిక టెక్నాలజీతో పట్టుకున్నారు
దేశవ్యాప్తంగా పలు దోపిడీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగులను హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో పట్టుకున్నారు. ఇటీవల ఇతర పేర్లతో సిమ్ వాడుతూ, కేవలం వాట్సాప్ కాల్స్ చేస్తూ యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మల్కాజిగిరి కార్పోరేటర్ తనయుడు అబిషేక్ను పోలీసులు అత్యాధునిక సాయంతో పట్టుకున్నారు.
సోషల్ మీడియాలోను
సోషల్ మీడియాలో నకిలీ ఐడీలు ఉపయోగించి చీటింగ్ చేస్తున్న వారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు పట్టుకుంటున్నారు. కొందరు రహస్య సమాచారాలను వివిధ పద్ధతుల్లో దాచి పెడుతుంటారు. స్టెగనోఫ్రీ డిటెక్షన్ అండ్ అనాలసిస్ ద్వారా పోలీసులు వీటిని కనిపెడుతున్నారు. గంటలు, రోజుల్లోనే నేరస్తులను పట్టుకుంటున్నారు.