దంపతుల ఆత్మహత్య: శవాల పక్కన రెండు రోజుల పాటు ఏడాది బాలుడు
హైదరాబాద్: తల్లిదండ్రుల ఆత్మహత్య ఏడాది బాలుడి జీవితాన్ని అంధకారంలో ముంచింది. రెండు రోజుల పాటు తల్లిదండ్రుల శవాల పక్కనే ఆ బాలుడు ఉండిపోయాడు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని కూకట్పల్లి సాయి ప్రసన్ననగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బెంగళూరుకు చెందిన మంజునాథ్(30), రాణి(25) దంపతులు గత కొన్ని నెలల నుంచి కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది బాలుడు ఉన్నాడు. అయితే రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. బాలుడిని మాత్రం ఏం చేయలేదు. రెండు రోజుల పాటు బాలుడు శవాల పక్కనే ఉన్నాడు.
చివరకు బాలుడు గుక్కపట్టి ఏడవడంతో ఇరుగుపొరుగు వారు గమనించారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాలుడికి స్థానికులు పాలు ఇచ్చి ఆకలిని తీర్చారు. స్నానం చేయించారు.
బాలుడి ఏడుపు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.