ఒక్కరు చెప్పేది 135 కోట్ల మంది వినాలా-హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా కీలక కామెంట్స్..
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్ది యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం జలవిహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపికైన యశ్వంత్ సిన్హా.. ప్రస్తుత రాజకీయాలపై ఇవాళ కీలక విమర్శలు చేశారు. అలాగే తనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన తెలంగాణ సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దన్యవాదాలు తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్ధితులపై స్పందించిన యశ్వంత్ సిన్హా.. ఒక్కరు చెబితే 135 కోట్ల మంది వినాలా అని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానిుంచారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు యశ్వంత్ సిన్హా వెల్లడించారు.
దేశంలో పరిస్ధితులు దిగజారుతుంటే చూస్తూ ఊరుకోలేమని, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. విద్వేషపూరిత ప్రసంగాలు ఏ సమాజానికీ మంచివి కావన్నారు. ఓ వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా .. ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా తన పోరాటం కొనసాగుతుందని యశ్వంత్ సిన్హా తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరమని, ఇప్పుడు చేసే పోరాటం భారత దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమని యశ్వంత్ సిన్హా తెలిపారు.