2016 ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు చేస్తున్నఉస్మానియా యూనివర్సిటీ; ఆ స్కాలర్స్ కు షాక్ .. రీజన్ ఇదే
పీహెచ్డీ నిబంధనల విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలో పీహెచ్డీ పూర్తి చేయాలనే నిబంధనలు పక్కా అమలు చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో పీహెచ్డీ పరిశోధనలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్న అధికారులు 2016 ముందు పీహెచ్డీ లో నమోదైన పరిశోధన పూర్తి చేయని స్కాలర్ లకు షాక్ ఇచ్చారు.
వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధన పూర్తి చేయకుంటే 2016 ముందు పీహెచ్డీ అడ్మిషన్లు తీసుకున్న వారి అడ్మిషన్లను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల చివరి నాటికి డెడ్లైన్ విధించి 2016 కంటే ముందు పీహెచ్డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ లోపు తమ పీహెచ్డీ పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని యూనివర్సిటీలో దాఖలు చేయకుంటే వారి అడ్మిషన్లు రద్దవుతాయని వెల్లడించారు.
నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాల లోపు పీహెచ్డీ ని పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు మరో రెండేళ్ల గడువు ఇస్తున్నామని, పొడిగించిన రెండేళ్ళ గడువు లోనూ అంటే మొత్తంగా ఆరేళ్ళ కాలంలో పీహెచ్డీ పూర్తి చేయని విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. 2016 ముందు పీహెచ్డీ అడ్మిషన్లు తీసుకున్న వారు వచ్చే నెలాఖరులోగా సిద్ధాంత గ్రంథాన్ని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. అలా చెయ్యలేకుంటే వారి అడ్మిషన్లు రద్దు అయ్యినట్టేనని సమాచారం.
ఇదిలా ఉంటే జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు మరోసారి గుర్తు చేశారు. నవంబర్ 1వ తేదీ నుండి బయోమెట్రిక్ హాజరు జెఎన్టియు తప్పనిసరి చేసిన నేపథ్యంలో, నిబంధనలు పాటించని కళాశాలలకు 20 వేల రూపాయల జరిమానా విధిస్తామని జె ఎన్ టి యు స్పష్టంచేసింది. అవసరమైతే కాలేజీల గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రకటనలో వెల్లడించారు. జె ఎన్ టి యు పరిధిలోని కళాశాలల హాజరు మొత్తాన్ని యూనివర్సిటీకి అనుసంధానం అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు గా ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో తెలియజేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్సు సీట్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈనెల 20వ తేదీలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.