తెలంగాణాలో పాదయాత్రల సీజన్.. బండి సంజయ్, రేవంత్ కు పోటీగా వైఎస్ షర్మిల పాదయాత్ర, తగ్గేలా లేరుగా!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించడానికి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి శ్రీకారం చుడుతున్నాయి . ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తామని ప్రకటించగా తాజాగా వైయస్ షర్మిల వైయస్సార్సీపి పార్టీ ప్రకటించడంతో పాటుగా 100 రోజుల్లో తాను పాదయాత్ర మొదలు పెడతానని వెల్లడించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలో సీజన్ మొదలైనట్లుగా కనిపిస్తుంది.
Recommended Video

త్వరలో బండి సంజయ్ పాదయాత్ర
పార్టీల అగ్రనేతల పాదయాత్రలతో తెలంగాణ రాష్ట్రంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. తెలంగాణ బిజెపి రథసారథి గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాడు. ఇదే సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీజేపీని క్షేత్రస్థాయిలో కి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొని బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా బండి సంజయ్ దూకుడు
బండి సంజయ్ ఆగస్టు 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు ఐదు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. 2024 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనుంది. దీనికోసం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. మొదటి విడత పాదయాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉండనుంది.ఇక రేవంత్ రెడ్డి సైతం సీఎం కేసీఆర్ పై పోరాటంలో భాగంగా పాదయాత్రని ఎంచుకున్నారు.

పాదయాత్ర చెయ్యనున్న రేవంత్ , వైఎస్సార్ బాటలో షర్మిల పాదయాత్ర
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్ర ద్వారా పేద ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్ రెడ్డి సైతం ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో నాడు వైయస్సార్ కాంక్షించిన ప్రజాసంక్షేమం కోసం రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని చెప్పిన వైయస్ షర్మిల సైతం వంద రోజుల పాదయాత్ర మొదలు పెడతానని వెల్లడించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి తాను పాదయాత్ర చేయనున్నట్లుగా షర్మిల తెలిపారు. వైయస్సార్ టిపి రాజకీయ పార్టీ మాత్రమే కాదని సంక్షేమం కోసం పని చేసే రాజకీయ వేదిక అని పేర్కొన్న షర్మిల తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ముగ్గురు కీలక నేతల పాదయాత్రలతో హోరేత్తనున్న తెలంగాణా
ఒక వైపు బండి సంజయ్, మరోవైపు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు వైయస్ షర్మిల పాద యాత్రలకు శ్రీకారం చుట్టడంతో టిఆర్ఎస్ పార్టీ అంతర్మథనంలో పడింది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ కొత్త బిచ్చగాళ్ళు వస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చేసింది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న నేపథ్యంలో, వారి ధాటిని తట్టుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది కూడా తెలంగాణా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ప్రత్యామ్నాయం లేదని చెప్పుకున్న గులాబీ నేతల్లో గుబులు .. రసవత్తర రాజకీయం
ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో సక్సెస్ అవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నిన్నమొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీకి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ లేదని గులాబీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారడం, ప్రతిపక్ష పార్టీలన్నీ యాక్టివ్ కావడంతో పాటు, ఇప్పటినుండే వ్యూహాలతో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావటం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications