కూలిన ప్రహరీగోడ: హైదరాబాదులో భారీ వర్షాలు, అస్తవ్యస్తం (పిక్చర్స్)
హైదరాబాద్: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాదులో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు గుంతలు పడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శనివారం ఉదయం హైదరాబాదులోని జర్నలిస్టు కాలనీలో ఓ ప్రహరీగోడ కూలింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రహరీ గోడ కూలడంతో ఐదు ఇళ్లు, లగ్జరీ కార్లు ధ్వంసమయ్యాయి. నాలుగు క్రేన్లతో శిథిలాలను తొలగించే పని సాగుతోంది. వర్షాలకు చెరువులను తలపించే విధంగా తయారయ్యే నగరరోడ్లతో నగర వాసులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊహకందని విధంగా మిట్టమధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకొస్తున్న మేఘాలతో భారీ వర్షం కురుస్తుండటం వాహనదారులకు, పాదచారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది.
శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్పేట మైత్రివనం వద్ద సుమారు రెండు అడుగుల నీరు ప్రవహించింది. అదేవిధంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు భారీగా చేరడంతో ఇబ్బంది పడ్డారు.

రోడ్లు జలమయం
శుక్రవారంనాడు భారీగా కురిసిన వానతో లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట తదితర ప్రాంతాల్లో ఎప్పటిలాగే గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఎంతో శ్రమించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

గాలి దుమారం కూడా..
గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో హైదరాబాదులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్ ప్రాంతంలో చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులు చెరువులుగా తలపించగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీళ్లు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు.

ప్రజల కష్టాలు
సాయంత్రం వర్షం రావడంతో ఇంటికి వచ్చే స్కూల్, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్థులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఉప్పల్, రామంతాపూర్, చిల్కానగర్, హబ్సిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసి జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.

మోకాళ్ల లోతు నీరు
రామంతాపూర్ మెయిన్రోడ్డులోని పోచమ్మ ఆలయం, హబ్సిగూడలోని పెట్రోల్ బంక్, ఉప్పల్ శేఖర్ హోజరీ వద్ద, నాగోల్ రోడ్డులో వర్షం నీళ్లు ఎక్కువై మోకాళ్లలోతు రాగా వచ్చిపోయే వాహనాలు చిక్కుకుని బయటకు వెళ్లలేక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. మూసీ ఉప కాలువల్లో వర్షం నీటి ఉధృతి పెరిగిపోయింది.

ఎక్కడి వాహనాలు అక్కడే..
సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది.

రోడ్లపై గోతులు...
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని కొట్టుకుపోయి పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఎక్కడ చూసినా రోడ్లపై బురద చేరి చిందరవందరగా తయారైంది. దీనికితోడు శుక్రవారం మరోసారి భారీ వర్షం కురవడంతో రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి.

పొంగి పొర్లుతున్న నాలాలా
ఓపన్ నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్లోని పలు మురికివాడల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇబ్బందులు ఇలా..
సికింద్రాబాదులోని మహమ్మద్గూడ, పార్శిగుట్ట, చిలకలగూడ, సీతాఫల్మండి, రైల్నిలయం, తుకారాంగేట్, లాలాపేట్ తదితర ప్రాంతాల ప్రజలు వాననీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి రోడ్లపై వాహనాలు స్తంభించిపోతున్నాయి.

ఇళ్లలోకి నీరు..
కాప్రాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షనికి రోడ్లన్నీ జలమాయం కావండతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో కాలనీలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. లోతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

గంటల తరబడి ట్రాఫిక్ స్తంభన
సికింద్రాబాదులోని కుషాయిగూడ, చర్లపల్లి, ఇసిఐఎల్, రాధికచౌరస్తా, ఎఎస్రావునగర్, మల్లాపూర్ హెచ్బికాలనీలో వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో భూగర్భ డ్రైనేజీలు పొంగిపొర్లుతూ కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతుంది.

సచివాలయంలోని కూలిన చెట్టు
హైదరాబాదులోని సచివాలయంలో చెట్టు కూలి కార్లు ధ్వంసమయ్యాయి. శుక్రవారంనాడు ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications