'ఇరవై రెండేళ్లుగా చెప్పి, ఇప్పుడు వెంకయ్యనాయుడు కాళ్లు మొక్కడం దౌర్భాగ్యం'
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అగ్రకులాలకు చెందిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాళ్లు మొక్కడం దౌర్భాగ్యమని, మందకృష్ణకు మాదిగలకు నాయకత్వం వహించే అర్హత లేదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగిన మాదిగ, మాదిగ ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పిడమర్తి రవి మాట్లాడుతూ... గత ఇరవై రెండేళ్లుగా ఉద్యమాల ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని చెప్పిన మందకృష్ణ ఇప్పుడు అగ్రకుల నాయకుల కాళ్ళు పట్టుకోవడం బాధాకరమన్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తూ మాయావతివంటి దళిత నాయకురాలిపై హీనమైన వాఖ్యలు చేస్తుంటే మరోవైపు మందకృష్ణ అగ్రనాయకుల కాళ్ళు మొక్కడం మాదిగజాతి ఆత్మగౌరవాన్ని ఇతర కులాలకు తాకట్టు పెట్టడమే అవుతుందన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం: హరీష్రావు
ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కంకణం కట్టుకుందని మంత్రి హరీష్రావు ఆదివారం నాడు సిద్దిపేటలో అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తున్న అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఇక్కడ నిర్వహిస్తామన్నారు.
నాణ్యమైన శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. యువతీ, యువకులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందాలన్నారు. కరువును తరిమికొట్టి వర్షాలు పడాలంటే చెట్లు నాటాలన్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత ఉద్యమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications