మెట్రోలో మోడీ ప్రయాణం, కేటీఆర్తో ముచ్చట్లు: రైలు నడిపిన మహిళా డ్రైవర్ (పిక్చర్స్)
Recommended Video
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మియాపూర్లో హైదరాబాద్ మెట్రో రైలును ఆవిష్కరించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి మియాపూర్ చేరుకున్న మోడీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం మెట్రో పైలాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు బ్రోచర్, యాప్ విడుదల చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులతో కలిసి ప్రధాని మోడీ వీక్షించారు. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు.
#FLASH PM Narendra Modi inaugurates #HyderabadMetro pic.twitter.com/VDbVSYjmPe
— ANI (@ANI) November 28, 2017
మెట్రోలో మోడీ వెంట వీరే
ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించే సమయంలో ఆయన వెంట సీఎం కేసీఆర్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు ఉన్నారు.
కేటీఆర్ చెబుతుంటే ఆసక్తిగా విన్న మోడీ
ప్రధాని మోడీకి ఓ పక్కన మంత్రి కేటీఆర్ కూర్చున్నారు. ప్రయాణించేటప్పుడు కేటీఆర్ ఆయనకు మెట్రో విశేషాలు చెబుతూ కనిపించారు. మోడీ కూడా బయటకు చూస్తూ ఆసక్తిగా విన్నారు. మరోవైపు కేసీఆర్, నరసింహన్ కూర్చున్నారు. మోడీ మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు, తిరిగి అక్కటి నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.
మెట్రో రైలు నడిపిన మహిళా డ్రైవర్
ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్, నరసింహన్లు ప్రయాణించిన రైలును ఓ మహిళా డ్రైవర్ నడిపారు. తొలుత మియాపూర్ రైల్వే స్టేషన్ చేరుకున్న ప్రధాని మొదటి అంతస్తులో డాక్యుమెంటరీ వీక్షించారు. అనంతరం రెండో అంతస్తుకు వెళ్లి మెట్రో రైలు ఎక్కారు.
12 నిమిషాలు మెట్రో ప్రయాణం
మోడీ, కేసీఆర్, నరసింహన్ తదితరులు దాదాపు పన్నెండు నిమిషాల పాటు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్ జరుగుతున్న హెచ్ఐసీసీకి బయలుదేరారు.
కేటీఆర్ను పక్కనే కూర్చోబెట్టుకున్న మోడీ
మంత్రి కేటీఆర్కు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారనే చెప్పవచ్చు. మెట్రో స్టేషన్ ప్రారంభం సందర్భంగా రిబ్బన్ కట్ చేసే సమయంలో మోడీ పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ నిల్చున్నారు. ఆ సందర్భంగా కొంచెం పక్కగా ఉన్న కేటీఆర్ను పిలిచి తన పక్కన నిలబెట్టుకున్నారు. అనంతరం మెట్రో రైల్లో కూడా తన పక్కనే కేటీఆర్ను కూర్చో బెట్టుకున్నారు.