బండి సంజయ్ పాదయాత్రపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు - ప్రత్యేక గుర్తింపు..!!
తెలంగాణలో బీజేపీ బలోపేతం పైన ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా రాష్ట్ర నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ప్రధాని ఆరా తీసారు. అదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసారు. తెలంగాణ కేంద్రంగా టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అనే విధంగా రాజకీయ పోరు సాగుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కార్యాచారణ ప్రారంభించారు. ఈ సమయంలో తెలంగాణలో రాజకీయాలు..పార్టీ పరిస్థితులపైన ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆరా తీసారు.
బండి పాదయాత్ర పై ప్రధాని ఆరా
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తరువాత ప్రధాని మోదీ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ను పిలిచి మాట్లాడారు. దాదాపు పది నిమిషాల సేపు తెలంగాణ రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగుతోందంటూ ప్రధాని ప్రశ్నించారు. సంజయ్ యాత్రకు ప్రజల్లో మంచి ప్రతిస్పందన లభిస్తోందని లక్ష్మణ్ వివరించారు. లక్ష్మన్ చెప్పిన సమాచారంతో ప్రధాని 'గుడ్' అంటూ ప్రశంసించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కూడా రోజురోజుకూ మెరుగు పడుతోందని లక్ష్మణ్ ఏం జరుగుతోందనేది పూర్తిగా వివరించే ప్రయత్నం చేసారు. ఈ రోజు సంజయ్ చేస్తున్న ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ జరగనుందని వివరించారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరువుతున్నారని చెప్పుకొచ్చారు.
సంజయ్ యాత్రపై నివేదిక కోరిన ప్రధాని
తెలంగాణలో బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర పైన తనకు వివరాలతో నివేదిక కావాలని ప్రధాని మోదీ కోరారు. దీనికి సంబంధించి ప్రజల్లో లభించిన ప్రతిస్పందన గురించి నివేదిక ఇవ్వాలని ఎంపీ లక్ష్మణ్ కు సూచించారు. సంజయ్ పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతోందని కూడా లక్ష్మణ్ వివరించారు. దీంతో, బండి పాదయాత్ర నివేదిక ఆధారంగా పాయింట్ ప్రజంటేషన్ కూడా రూపొందించాలని సూచించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా దానిని ప్రదర్శించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైన ప్రధాని ఆరా తీసారు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
నేటి ముగింపు సభకు నడ్డా హాజరు..
బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం కరీంనగర్లో జరగనుంది. సంజయ్ యాత్ర బుధవారం 1400 కిలోమీటర్లు పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య హజరుకానున్నారు. నడ్డా కర్ణాటక నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాక.. హెలికాప్టర్ ద్వారా కరీంనగర్కు వెళతారు. పలువురు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు. తన సొంత గడ్డపై బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల, కోర్ కమిటీ సమావేశం గురువారం ఉదయం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. ఇక, ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రపై ప్రధాని ఆరా తీయటం.. ప్రశంసించటం ఇప్పుడు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.