జాబ్ ఫ్రాడ్: టీ9 న్యూస్ చానెల్ సిఇవోతో పాటు నలుగురి అరెస్టు
హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసి టీ9 న్యూస్ చానెల్ సిఇవోతో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జాబ్ ఫ్రాడ్ కేసులో హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు వారిని మంగళవారంనాడు అరెస్టు చేశారు.
జెన్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద యెత్తున డబ్బులు వసూలు చేసి వారు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీ9 న్యూస్ చానెల్ సిఇవో కొమ్మిరెడ్డి, సచివాలయంలో డిఆర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దారా వెంకటేశ్వర రావు, ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టి. రమేష్లతో పాటు బి నరేష్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేశారు. శ్రీసాయి వేణు, ఇ. మహేష్ అనే ఇద్దరు యువకులు జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు పెట్టుకున్నారు. వారు రమేష్ను సంప్రదించారు. ఉద్యోగాలు ఇప్పించడానికి అతను పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి అడ్వాన్స్గా రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు.
ఆ తర్వాత వారిద్దరిని నరేష్కు పరిచయం చేశారు. అతను వారిని కోమ్మిరెడ్డి వద్దకు తీసుకుని వెళ్లాడు. తనకు వెంకటేశ్వర రావు తెలుసునని ఉద్యోగాలు ఇప్పిస్తానని కొమ్మిరెడ్డి నమ్మబలికాడు. పరీక్షకు ముందు రోజు ప్రశ్నపత్రం అందిస్తామని వారికి హామీ ఇచ్చాడు. వారు ఇంతకు ముందు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని పది మంది నుంచి లక్ష రూపాయలేసి వసూలు చేసినట్లు కూడా పోలీసు దర్యాప్తులో తేలింది.












Click it and Unblock the Notifications