వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు. గతంలో సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణంలో దొరికిన ఓ లేఖ ఆధారంగానే ఈ నిర్దారణకు వచ్చినట్టు సీపీ కమల్ హాసన్ రెడ్డి వెల్లడించారు. లెటర్లోని హ్యాండ్ రైటింగ్,ఇతర పుస్తకాల్లో హ్యాండ్ రైంటింగ్.. రెండూ ఒకటేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందన్నారు.

కనిపించకుండా పోయిన 20 రోజులకు...
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం ఈ ఏడాది జనవరిలో అదృశ్యమైంది. కనిపించకుండా పోయిన 20 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో వీరి కారు బయటపడింది. అందులో రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)ల మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇలా వెలుగులోకి...
అంతకుముందు రోజు రాత్రి పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన అనే దంపతులు కరీంనగర్ నుంచి గన్నేరువరం వెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు అలుగునూరు కెనాల్లో పడిపోయారు. బైక్ లైట్ వెలుతురుకి భారీగా వచ్చిన పురుగులు ప్రదీప్ కళ్లల్లో పడటంతో.. ప్రమాదవశాత్తు బైక్ కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి.. ప్రదీప్ను కాపాడారు. అప్పటికే కీర్తన గల్లంతయ్యారు. దీంతో కీర్తన కోసం గాలించేందుకు అధికారులతో మాట్లాడి కాలువకు నీటిని నిలిపివేశారు. దీంతో మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. కాలువలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. అందులోనే సత్యనారాయణ రెడ్డి కారు బయటపడింది. జనవరి 27న ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు.

ఇదీ నేపథ్యం..
దాసరి మనోహర్ రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి కరీంనగర్లో సాయి తిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ వ్యాపారం చేస్తున్నారు. మనోహర్ రెడ్డి సోదరి,సత్యనారాయణ రెడ్డి భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. సత్యనారాయయణ-రాధ దంపతులకు ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు శ్రీనివాస్రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అప్పటినుంచి ఆ కుటుంబం మానసికంగా కొంత కుంగిపోయింది. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది.

సూసైడ్ అని నిర్దారణ
విచారణలో భాగంగా సత్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్ షాప్ లో పోలీసులకు ఓ నోట్ లభించింది. అందులో తన ఆస్తి మొత్తాన్ని టీటీడీకి రాసివ్వాలని ఆయన పేర్కొన్నారు.పోలీసులు ఆ నోట్ను , సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన కొన్ని పుస్తకాలను ఫోరెన్సిక్ టెస్ట్కు పంపించారు. లెటర్ లోని హ్యాండ్ రైటింగ్, ఆ పుస్తకాల్లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఒకటేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలడంతో సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications