విచిత్ర తీర్పు: న్యాయం చేయాలని అడిగితే అన్యాయమైన తీర్పిచ్చిన పంచాయతీ పెద్దలు, కేసు
కట్టుకున్నొడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తీరు మార్చుకోవాలని చెప్పినా.. వినిపించుకోలేదు. లాభం లేదనుకొని పంచాయతీ పెద్దలకు విషయం తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కానీ వారు మాత్రం వివాహితకు అన్యాయమైన తీర్పునిచ్చారు. తనకు న్యాయం జరగలేదు అని ఆ ఇల్లాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకకు చెందిన హరిబాబుకి ఐదేళ్ల క్రితం జ్యోతితో వివాహామైంది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే హరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన జ్యోతి.. ఇదేంటని నిలదీసింది. ఈ విషయంపై వారికి గొడవలు కూడా జరిగాయి. తనకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ పెద్దలను కోరింది.
అయితే పంచాయతీ పెద్దలు మాత్రం విచిత్రమైన తీర్పునిచ్చారు. న్యాయం చేరమని జ్యోతి కోరితే.. ఆమె భర్తకు జస్టిస్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఎకరాం పొలం పేరున రాయాలని, అంతేకాదు హరిబాబు ఆమెతో ఉండాలని తీర్పునిచ్చారు. వారి తీర్పు విన్న జ్యోతి ఖంగుతిన్నది. గ్రామ పెద్దల తీర్పుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.