కొత్త ట్విస్ట్: రాజీవ్ వేధింపులు, బెదిరింపులు.. శిరీషపై గతంలోను దాడి?
ఫిలింనగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటిషియన్ శిరీష కేసులో మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెది ఆత్మహత్య కాదని.. చంపేసి ఉంటారని పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోందంటున్నారు.
హైదరాబాద్: ఫిలింనగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటిషియన్ శిరీష కేసులో మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెది ఆత్మహత్య కాదని.. చంపేసి ఉంటారని పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోందంటున్నారు.
చదవండి: శిరీష పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
తాజాగా, మరో విషయం వెలుగు చూసిందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిరీషకు ఆమె పని చేసే స్టూడియో యజమాని రాజీవ్కు మధ్య విభేదాలు ఉన్నట్లు, వాటిని పరిష్కరించుకునేందుకు కుకునుర్పల్లి వెళ్లినట్లు చెబుతున్నారు.
గతంలోను రాజీవ్ వేధింపులని..
గతంలోను శిరీషపై రాజీవ్ పలుమార్లు భౌతిక, లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ప్రచారం సాగుతోంది. రాజీవ్ కొట్టిన దెబ్బల ధాటికి ముఖం కమిలిపయిన శిరీష ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ దెబ్బలు ఏమిటని ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా.. ప్రమాదం జరిగిందని శిరీష ఇంట్లో చెప్పిందని తెలుస్తోంది.
ఎవరికైనా చెబితే కూతుర్ని చంపేస్తానని...
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. తన వద్ద ఉద్యోగం చేస్తోన్న శిరీషను రాజీవ్ పలుమార్లు వేధించాడని, ఆమెపై వేధింపులకు పాల్పడ్డాని, ఈ విషయాలను ఎవరికైనా చెబితే కూతురును చంపేస్తానని బెదిరించేవాడని, పెళ్లిళ్లలో ఫోటోషూట్లు చేసే సమయంలోను రాజీవ్ అమ్మాయిల పట్ల అదో రకమైన ధోరణితో వ్యవహరించేవాడని ప్రచారం సాగుతోంది. అయితే, ఇదంతా వాస్తవమా కాదా తేలాలంటే పోలీసుల విచారణలోనే తెలుస్తుంది.
అనేక కోణాల్లో విచారణ
కాగా, ఫిలింనగర్లోని షేక్పేట ఆర్జే ఫొటో స్టూడియోలో బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య పెను సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసును అనేక కొత్త కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురువారం సాయంత్రం శిరీష పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందజేశారు. శిరీష మెడ, చెవి, పెదవులపై బలమైన గాయాలు ఉన్నట్టు నిర్థారించారు.
ఆత్మహత్యగా చిత్రీకరించారా?
దీంతో ఆమెను ఎవరైనా హత్యచేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణకు ఇంటెలిజెన్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అధికారులు శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలోకి వెళ్లి రెండు గంటలకు పైగా వివిధ కోణాల్లో పరిశీలించారు. బయోమెట్రిక్ అమర్చే ప్రతినిధులను పిలిపించి శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిని రెండు గంటల పాటు తనిఖీ చేశారు. ఎవరెవరు ఆ కార్యాలయానికి వచ్చారు? వారి థంబ్ ప్రింట్కు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.
శిరీష మృతి.. వెంటనే ఎస్సై ఆత్మహత్య.. రెండు కేసుల్లోను..
ఈ నెల 12న రాజీవ్, శ్రవణ్లతో కలిసి కుకునూరుపల్లికి వెళ్లి వచ్చాక శిరీష ఆత్మహత్య చేసుకోవడం, ఆమె కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించాయి. అయితే, కుకునూరుపల్లి నుంచి వచ్చాక అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి బృందం కూడా ఎస్సై ప్రభాకర్రెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన ఘటన విచారణలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ సమగ్రంగా విచారణ చేపట్టి డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు.