నయీం కేసు: త్వరలో 'కీలక' నేతల అరెస్ట్, బెదిరింపులు ఆ నాయకులదే!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం కీలక ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో కీలక నేతల అరెస్టులు త్వరలో జరగనున్నాయని అంటున్నారు. అలాగే నయీంకు సహకరించిన పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకోనున్నారు.
నయీంతో సంబంధాలున్న పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై సిట్ చర్యలకు సిద్ధం అవుతోంది. వీరి ప్రమేయానికి సంబంధించి ఇప్పటికే కచ్చితమైన ఆధారాలు లభించాయని తెలుస్తోంది. దీంతో వారిని అరెస్టు చేసే అవకాశముందని చెబుతున్నారు. దీనిపై సిట్ అధికారులు గురువారం సమీక్ష నిర్వహించారని తెలుస్తోంది.
చంద్రబాబుని లాగారు: నయీం కేసులో బెల్లి సోదరుడి షాకింగ్, సీసాలు అమ్ముకొని జీవనం
ఎన్కౌంటర్లో హతమైన అనంతరం నయీం చేసిన ఎన్నో అరాచకాలు వెలుగు చూసిన, చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ గ్యాంగ్స్టర్, అతని అనుచరులపై నూటా యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి. పెద్ద మొత్తంలో భూములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం, అనుచరులు పదుల సంఖ్యలో హత్యలు చేశారని గుర్తించారు.
అతని అరాచకాలకు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులు సహకరించినట్లు మొదట్లో ఆరోపణలొచ్చాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులపై రాతపూర్వకంగా ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. మరోవైపు తమకు సహకరించిన పోలీసు అధికారుల వివరాలను నయీం అనుచరులు విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. సిట్ ఆధారాలు కూడా సేకరించిందని తెలుస్తోంది.
నయీం చనిపోయాక బెదిరింపులు
నయీం చనిపోయిన అనంతరం కొందరు బాధితులు తమను పలువురు నాయకులు బెదిరించారంటూ పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపులకు సంబంధించి వారి మాటలతో కూడిన ఆడియో రికార్డులనూ అందించారు. దీంతో వాటిలోని స్వరం నిందితులదేనా కాదా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో సిట్ పరీక్షలు నిర్వహించింది.
ఫిర్యాదుల్లోని స్వరం సదరు నాయకులదేనని నిర్ధరణ అయినట్లుగా తెలుస్తోంది. వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారంటున్నారు. పోలీసుల పాత్ర పైన విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, చంచల్ గూడ జైలులో ఉన్న నయీం భార్య హసీనా బేగం, సోదరి సలీమా బేగంలను పోలీసులు పీటీ వారెంట్ పైన అరెస్టు చేసి గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి తొమ్మిది రోజుల రిమాండ్ విధించారు.