అలా ఐతే నా ఇల్లు కూల్చండి: కేటీఆర్, హరీశ్ రావులకు పొంగులేటి సవాల్
హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించేందుకు హైడ్రాను తెచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ పరిధిలో నిర్మాణాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. అలాంటి కట్టడాలను కూల్చుతున్నామని, అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కట్టడాలని తెలిపారు. హిమయత్సాగర్ ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ పార్టీ మీడియా బురదజల్లుతోందని మండిపడ్డారు.

తాను కేటీఆర్, హరీశ్రావులకు సవాల్ విసురుతున్నానని.. తన ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైడ్రా అధికారుల బదులు మీరే వెళ్లి కొలవండని, అక్రమమని తేలితే కూల్చేయండని సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి.
మీ(కేటీఆర్, హరీశ్ రావు)తో చెప్పించుకునే పరిస్థితుల్లో ఈ పొంగులేటి లేడని, ఏదో చేసేందుకు నన్ను బూచిగా చూపాలని చూస్తున్నారని, తన సవాల్ను స్వీకరించాలంటూ మంత్రి పేర్కొన్నారు. అక్కడ తానే నివసిస్తున్నానని, బీఆర్ఎస్ నేతల మాదిరి ఫాంహౌస్ నాది కాదని తప్పించుకోనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు, తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తోందని చెప్పారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి రాష్ట్రం రూ. 7.19 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి.. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాము ఇతర ఖర్చులన్నీ తగ్గించుకుని.. రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా రైతులకు రుణాలు మాఫీ కాకుంటే వారికి కూడా మాఫీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications