కాశ్మీర్లో పాక్ జెండా, మోడీదే బాధ్యత: పొంగులేటి, 'కెసిఆర్! బడ్జెట్ పరిస్థితేంటి'
హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.
చివరకు తీవ్రవాదుల అంశాన్ని కూడా బిజెపి స్వలాభం కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కసబ్ను ఉరి తీశారని, అయితే, తీసిన తర్వాతే అది మీడియాకు తెలిసిందన్నారు. కానీ బిజెపి మాత్రం మెమెన్కు ఉరిశిక్షను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.
ఈ ప్రచారంతో దేశవ్యాప్తంగా మతపరమైన అంశాలను రెచ్చగొట్టేందుకు బిజెపి యత్నిస్తోందని ఆరోపించారు. కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నాయన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే దానికి మోడీనే బాధ్యత వహించాలన్నారు.
మిగులు బడ్జెట్ అంటూ: టిడిపి
తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ అంటూనే బిల్లులు పెండింగులో పెడుతున్నారని ఆరోపించారు.
తొలగించిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. లక్ష ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆకాశహర్మ్యాలు అంటున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి కార్యక్రమం తూతూమంత్రంగా నిర్వహించారన్నారు.