మజ్లిస్తో పొత్తులేదు, మరికొందరు: జగదీశ్వర్, సొంత పార్టీల్లోనే దానం, ప్రకాశ్ గౌడ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం నాడు చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలు తమవేనని చెప్పారు.
టిడిపి ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ... త్వరలో మరికొందరు తమ పార్టీలోకి వస్తారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కన్నతల్లి వంటి టిడిపిని వీడను: ప్రకాశ్ గౌడ్
కన్నతల్లి వంటి తెలుగుదేశం పార్టీని తాను వీడే సమస్యే లేదని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. తాను టిఆర్ఎస్లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు సరికాదన్నారు. ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలు మంచిది కాదన్నారు. తాను టిడిపిలోనే ఉంటున్నానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో నాకు అసంతృప్తి లేదు: దానం
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కూడా కారు ఎక్కుతారనే ప్రచారం జరిగింది. దీని పైన దానం స్పందించారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. తాను పార్టీ మారే సమస్య లేదన్నారు. సోనియా, దిగ్విజయ్ సింగ్లు తనకు గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు.
తాను కాంగ్రెస్ పార్టీ సమన్వయ సభ్యుడిని కానందునే కాంగ్రెస్ సభ్యుల సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. తాము కలిసికట్టుగా పని చేసి గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. తనకు పార్టీలో ఎవరితోను శతృత్వం లేదన్నారు.
అంతకుముందు దానం నాగేందర్ తన అనుచరులతో భేటీ అయ్యారు. అనుచరులతో మాట్లాడుతూ.. తనకు పార్టీ పొమ్మనలేక పొగపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ కోసం తన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications