కల్లాల దగ్గర రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కు పట్టిన గతే; కాంగ్రెస్, బీజేపీలపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఫైర్
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి ని, బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్లాల వద్దకు కాంగ్రెస్ పార్టీ అంటూ రైతుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశద్రోహులు దళారులు ధర్నాలు చేస్తే కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందా అంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలని సవాల్ విసిరారు.
సాగు చట్టాల రద్దుతో రైతులు ఎవరి మెడలు వంచారో సంజయ్ చెప్పాలి: జీవన్ రెడ్డి
బండి లేని బండి సంజయ్ కేంద్రం అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపడుతున్నారని గతంలో మూర్ఖంగా విమర్శించడాన్ని గుర్తుచేసి, ఇప్పుడు రైతులు ఎవరి మెడలు వంచారో చెప్పాలని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాతల ఉద్యమంతో మోడీ సర్కార్ దిగి వచ్చిందని పేర్కొన్న జీవన్ రెడ్డి గతంలో ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను ఎంపీ అరవింద్ ఉగ్రవాదులతో పోల్చడని గుర్తుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదు అని పేర్కొన్న జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ మొదటి నుండి సాగు చట్టాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారని కెసిఆర్ మహాధర్నా కేంద్రాన్ని కదిలించింది అని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి
కెసిఆర్ నవంబర్లో దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇప్పుడు మళ్లీ నవంబర్ లో ధర్నా చేస్తే సాగు చట్టాలు వెనక్కి వెళ్లాయని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు రేవంత్ ఇప్పుడు నోరు విప్పారు అని విమర్శలు గుప్పించారు. నెల రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన బాట పడితే అప్పుడు రేవంత్ ఎక్కడికి పోయాడు అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని పేర్కొన్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలు జనాలు నమ్మరు అని తేల్చి చెప్పారు.
వరి కల్లాల దగ్గర రేవంత్ కు బండి సంజయ్ కు పట్టిన గతే
వరి కల్లాల దగ్గరికి వెళ్తే రేవంత్ కు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐకెపి కేంద్రాల్లో దగ్గరికి వెళ్లిన బండి సంజయ్ కు పట్టిన గతే పడుతుందని జీవన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో మాట్లాడి బీజేపీ పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు పరిహారం చెల్లించి కేంద్రం ఆదుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఒక శక్తి అని మహాధర్నా ద్వారా కేంద్రం మెడలు వంచారని పేర్కొన్న జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, బిజెపి నేతలు తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న బీజేపీ, కాంగ్రెస్
ఇదిలా ఉంటే తెలంగాణా ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చెయ్యటం లేదని బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపిస్తూ తెలంగాణా సర్కార్ ధాన్యం కొనుగోలు చెయ్యాలని కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక ఏకంగా కాంగ్రెస్ పార్టీ కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక క్షేత్ర స్థాయిలో పర్యటనలో రైతుల గోస వర్ణనాతీతంగా ఉందని, కల్లాలు చూస్తే కన్నీళ్లు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని అన్నారు.