ప్రత్యేక హోదాపై పురంధేశ్వరి వివరణ, చంద్రబాబు ప్రభుత్వానికి సలహా
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్న కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ వ్యాఖ్యలు శుక్రవారం నాడు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బిజెపి నేతలు దీనిపై స్పందిస్తున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వెనక్కి పోదని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురందేశ్వరి శనివారం చెప్పారు. సాంకేతికపరమైన కారణాలతోనే ప్రస్తుతం హోదా ఇవ్వలేకపోతోందన్నారు. హోదా ఇవ్వలేకపోయినా ఆ స్థాయిలో రాష్ట్రానికి సాయం అందిస్తామన్నారు.
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగినా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. నిధులు తెచ్చుకునే విషయంలో రాష్ట్రం మరింత చొరవ చూపాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
కాగా, విశాఖలో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ప్రత్యేకహోదాపై కార్యకర్తలు నిలదీశారు.
ప్రత్యేక హోదా పైన పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలన్నారు. కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడ్డారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజల్లో తిరగలేమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తుందని వారు హామీ ఇచ్చారు.