ఈ పురోహితుడు మాకొద్దు బాబోయ్ అంటూ ఓ గ్రామం తీర్మానం; అయ్యగారి డిమాండ్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!!
మన ఇళ్లల్లో శుభకార్యాలు అయినా, అశుభ కార్యాలు అయినా నిర్వహించడంలో పురోహితుడికి ప్రధానమైన పాత్ర ఉంటుంది. పౌరహిత్యం మీద జీవనం సాగించే పురోహితులకు ఎక్కడికి వెళ్ళినా అగ్రతాంబూలం ఉంటుంది. పూజలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు ఇలా ఏది చేయాలన్నా పురోహితులు వచ్చి చేయాల్సిందే. అలా అందరి క్షేమాన్ని కోరే పురోహితులంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం బంజేరుపల్లిలో మాత్రం ఈ పురోహితుడు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. అసలు ఇంతకీ ఆ పురోహితుడు ఏం చేశాడు? ఎందుకు ప్రజలు ఇంతగా అతడ్ని వ్యతిరేకిస్తున్నారు అంటే అందుకు పెద్ద కథాకమామీషునే ఉంది.
ఆర్టీసీ నష్టాల డ్రామా ఎందుకు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కేసీఆర్ కు షర్మిల చురకలు
పురోహితుడు వద్దంటూ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం
సహజంగా పురోహితులు ఏ శుభకార్యం చేయాలన్నా, అశుభకార్యాన్ని నిర్వహించాలి అన్నా సదరు కార్యక్రమ నిర్వాహకుల నుండి సంభావనగా డబ్బులు తీసుకుంటారు. ఇరువర్గాల అభిప్రాయం మేరకు కాస్త అటూ ఇటుగా పురోహితులు తమకు రావాల్సిన సంభావన తీసుకుంటుంటారు. అయితే బంజేరుపల్లిలో ఓ పురోహితుడు సంభావన పేరుతో చేస్తున్న దోపిడిని భరించలేక గ్రామస్తులంతా ఓ తీర్మానం చేసుకున్నారు. ఈ పురోహితులు మాకొద్దు బాబోయ్ అంటూ ఏకతాటి మీద నిలబడి, ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామసభ నిర్వహించి మరీ తీర్మానం చేశారంటే అయ్యగారి నిర్వాకం ఏవిధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
శుభకార్యం ఏదైనా.. బంగారంతో పాటు డబ్బు డిమాండ్
తాను అడిగినంత సంభావన ఇస్తేనే శుభకార్యమైనా, అశుభకార్యమైనా జరిపించడానికి వస్తాను.. లేదంటే రానంటే రాను అని సదరు అయ్యగారు భీష్మించుకుని కూర్చున్నాడని సమాచారం. ఇక పురోహితుడి డిమాండ్ చూస్తే కళ్ళు తేలెయ్యాల్సిందే. పెళ్లి చేయాలంటే తులం బంగారంతో పాటు, వధూవరుల తల్లిదండ్రుల నుండి 20 నుంచి 25 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నాడని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గృహప్రవేశ కార్యక్రమం అయితే సంభావన అర తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట సదరు టాలెంటెడ్ పురోహితుడు.
పేదలను సైతం పీడిస్తున్న పురోహితుడు.. అడిగింది ఇవ్వకుంటే శాపనార్ధాలు
ఆర్థిక స్తోమత లేని నిరుపేద కుటుంబాలను కూడా వదలకుండా ఈ అయ్యగారు వేధింపులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. అడిగినంత సంభావన ఇస్తేనే వస్తానని, లేదంటే వచ్చేది లేదని తేల్చి చెబుతున్నాడని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనను కాదని గ్రామంలో ఇంకెవరు పౌరోహిత్యం చేస్తారో చూస్తానంటూ బెదిరిస్తున్నాడని, ఎవరైనా కాలు పెడితే ఊరుకునేది లేదంటూ హుకుం చెలాయిస్తున్నాడని మండిపడుతున్నారు. అయ్యగారు అడిగినంత సంభావన ఇస్తే ఓకే లేదంటే, రకరకాల శాపనార్థాలు కూడా పెడుతున్నాడని లబోదిబోమంటున్నారు.
పురోహితుడి వేధింపులు భరించలేక గ్రామసభ పెట్టి మరీ తీర్మానం
ఒక్కోసారి పురోహితుడి శాపనార్ధాలు పెట్టిన ఇళ్ళల్లో ఏదైనా అశుభం జరిగినా, అనర్థాలు జరిగినా పురోహితుడి తిట్ల కారణంగానేనని స్థానిక ప్రజలు బాధపడుతున్నారు. ఇక ఈ బాధలు భరించలేక ఫైనల్ గా ఊరంతా ఒక నిర్ణయానికి వచ్చారు. తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న పురోహితుడు తమ గ్రామానికి అవసరం లేదంటూ గ్రామ పెద్దలు అంతా కలిసి తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరు ఆ పురోహితుడిని కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని గ్రామస్తులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు.
Recommended Video
గ్రామస్తులకు కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని ప్రతిజ్ఞ
బంజేరుపల్లిలోని హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులంతా పురోహితుడి ఆగడాలపై చర్చించి ఫైనల్ గా ఈ పురోహితుడు మాకొద్దు బాబోయ్ అని తేల్చి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామస్తులు ఎవరూ అతన్ని కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని రూల్ కూడా పెట్టారు. మరీ ఇంతలా వేధిస్తే ఎవరైనా ఇదే పని చేస్తారు అని అయ్యగారి నిర్వాకం విన్నవారంతా చెప్పుకుంటున్నారని సమాచారం. ఏదైనా సరే శృతిమించితే ఎండ్ కార్డు పడుతుందని పురోహితుడు వద్దంటూ గ్రామస్తులు తీర్మానం చేసిన ఈ ఘటనతో స్పష్టంగా అర్థమవుతుంది.