ఇన్ఫోసిస్ కంపెనీలో కొండచిలువ: గుప్తనిధుల కోసం తవ్వకాలు
హైదరాబాద్: రంగా రెడ్డి జిల్లాలోని ఘట్కేసర్ మండలం పోచారంలోని ఇన్ఫోసిస్ కంపెనీలో కొండ చిలువ కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న గుట్టల నుంచి కొండ చిలువ ఐటీ కారిడార్లోకి వచ్చినట్లు కంపెనీ సిబ్బంది తెలిపింది. కొండ చిలువను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కంపెనీలో కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గుట్కా కేంద్రాలపై దాడి
ఇదిలావుటే, రంగారెడ్డి జిల్లాల్లోని రాజేంద్రనగర్లో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 20 లక్షల విలువైన గుట్కా పదార్థాలు, యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ లాకర్లో డబ్బు మాయం
మెదక్ జిల్లా పటాన్చెరులో గల సెంట్రల్ బ్యాంక్ లాకర్లో డబ్బు మాయమైంది. గంగాధర్ అనే వ్యక్తికి చెందిన లాకర్లో రూ. 20 లక్షలు కనిపించకుండా పోయాయి. నగదు అదృశ్యమైన విషయాన్ని గుర్తించిన గంగాధర్ రెండు రోజులక్రితమే బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా డబ్బు మాయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బ్యాంక్లో విచారణ చేపట్టారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
హైదరాబాద్లోని అంబర్పేటలోని దోబీగల్లీలో ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. వంద అడుగుల మేర గొయ్యి తవ్వి ఇంటి యజమాని పూజలు నిర్వహిస్తున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంటి యజమానితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
గుప్త నిధుల కోసం ఎనిమిది నెలలుగా తవ్వుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, గుప్త నిధుల కోసం తవ్వామనే ఆరోపణను ఇంటి యజమాని పద్మ ఖండిస్తున్నారు. తాము మంత్రగాడిని ఏమీ రప్పించలేదని ఆమె అంటున్నారు. నీళ్ల కోసమే గత ఎనిమిది నెలలుగా గుంత తవ్వుతున్నామని చెప్పారు. ఇదేం రహస్యంగా జరగడం లేదని చెప్పారు.