కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్, 18 ప్లస్ రేటింగ్: స్మగ్లింగ్ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు సంచలనం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నాటి ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి భాష ఇలా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భాషే ఇలావుంటే, ఆయన పార్టీ నేతల భాష ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

పీకే డైరెక్షన్లోనే.. కేసీఆర్ భాషపై చర్చ జరగాలన్న రఘునందన్
ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు చేసిన తప్పేంటో కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ దూషించిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, మేధావులు కేసీఆర్ భాషపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు రఘునందన్. బూతులు మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం సరైందేనా ఆలోచించాలన్నారు. ప్రశాంత్ కిషోర్ని కేసీఆర్ ఇటీవల తరుచూ కలుస్తున్నారు. పీకే డైరెక్షన్ మేరకు కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్.. బహరింగ చర్చకు సిద్ధమా?: రఘునందన్ రావు సవాల్
వడ్ల కొనుగోళ్లపైన శాస్త్రీయ డిబేట్కు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన అయితలేదనే కేంద్రం మీద కక్ష కట్టారని రఘునందన్ రావు అన్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. డీలిమిటీషన్ జరిగితే మరికొంత మందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. మౌనంగా ఉంటే బీజేపీ మింగేస్తోందనే భయంతో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. హిందువుల గురించి బీజేపీ మాట్లాడితే మతతత్వం అంటున్నారు, నిత్యం నిజాంను కేసీఆర్ పొగుడుతున్నారు.. ఇది మతతత్వం కాదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టి పాలమూరుకు ఎన్ని టీఎంసీల నీళ్లు కొత్తగా ఇచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆరోపణలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం అని రఘునందన్ రావు ప్రతి సవాల్ విసిరారు.

బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్పై ధర్మపురి అరవింద్ ఫైర్
మరోవైపు, కేసీఆర్పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతలు బియ్యం స్మగ్లంగ్తో కోట్లు ఆర్జిస్తున్నారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. గిరిజన యూనివర్సీటీకీ రాష్ర్ట ప్రభుత్వమే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. టీఆర్ఎస్ అండతోనే మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని అరవింద్ తెలిపారు. ఎఫ్సీఐకి తెలంగాణలో పండే పంటను తక్కువగా ఇస్తూ, రీస్లైకింగ్ బియ్యం ఎక్కువగా ఇస్తూ కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని అరవింద్ మండిపడ్డారు. కేసీఆర్కు రైతుల మీద ప్రేమ లేదని, కేసీఆర్, కేటీర్ బట్లర్లుగా తయారైయ్యారన్నారు. రైస్ మిల్లర్లు పది నుంచి పన్నెండు శాతం తరుగు తీస్తున్నా.. కేటీఆర్, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. రైస్మిల్లర్లతో టీఆర్ఎస్ నేతలు కుమ్మకైయ్యారన్నారు. రైతుల పొట్ట కొడుతూ రైతులపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేసీఆర్ ఆగం పట్టిస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు అరవింద్. ఇప్పటికైనా కేసీఆర్ విమర్శలు ఆపి రైతుల ధాన్యం కొనాలని, కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.

కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్ 18ప్లస్ రేటింగ్ ఇవ్వాలని చురకలు
ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు అరవింద్. కేసీఆర్ కేంద్ర మంత్రులపై మాట్లాడుతున్న భాష దుబాయి శేఖర్ లాగా ఉందని విమర్శించారు. కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్ 18ప్లస్ రేటింగ్ ఇవ్వాలని చురకలంటించారు. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా కేసీఆర్ భాష ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడంలో కేసీఆర్ గొప్పతనం లేదన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారు? అంటూ అరవింద్ ప్రశ్నించారు. 2014 నుంచి సీఎం కేసీఆర్ ఏ పంటకు బోనస్ ఇచ్చారు? ఏ పంటలను వేయమని ప్రోత్సాహించాడు ? అని నిలదీశారు బీజేపీ ఎంపీ అరవింద్. గతంలో మొక్కజొన్న, సోయాబీన్ పండించే రైతులను సన్న వడ్లు పండించమని కేసీఆర్ కోరలేదా? అంటూ ఎంపీ ప్రశ్నించారు. కేసీఆర్ మీడీయా సమావేశాలు అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయన్నారు. రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించమని విద్యుత్ చట్టంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి కేసీఆర్ బీజేపీ ఎంపీలపై పదజాలాన్ని వాడుతున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పిచ్చి ముదిరి, హద్దు మీరి, దిగజారి మాట్లాడాతున్నారని సంజయ్ అన్నారు. కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలని.. టీవీలలో ఆయన లైవ్ కూడా బంద్ చేయాలని అన్నారు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు బీప్ సౌండ్ వేసి బూతులు కట్ చేయాలని.. లేదంటే చానళ్లపై కేసులు పెడతారని సంజయ్ హెచ్చరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్పై మండిపడ్డారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్.. నీ నోటిని ఫినాయిల్తో కడిగినా, ఇనుప బ్రష్ తో రుద్దినా ఉపయోగం లేదంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications