దేశ శాసనవ్యవస్థలో ఇవాళ బ్లాక్ డే; కేసీఆర్ కు భవిష్యత్లో ఇదే అవమానం: రఘునందన్ రావు
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు సూచనల మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలిసి శాసనసభ సమావేశాలకు తమకు అనుమతి ఇవ్వాలని కోరిన బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తిరస్కరించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video
స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తమపై సస్పెన్షన్ ఎత్తెయ్యలేదు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పీకర్ కు రాజకీయాలను ఆపాదించటం తమకు ఇష్టం లేదని, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే తమపై సస్పెన్షన్ ఎత్తివేయకూడదని భావిస్తున్నారని ఆరోపించారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చెయ్యటం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని మండిపడ్డారు. తెలంగాణా హైకోర్టు సూచనతో స్పీకర్ దగ్గరకు వెళ్లి సభకు అనుమతి ఇవ్వాలని కోరినా ఆయన ఒక్క నిముషంలో తిరస్కరించారని అసహనం వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో కేసీఆర్ కు ఇదే తరహా అవమానం
సభలో ప్రతిపక్షాల గొంతును వినిపించకుండా చేయడం కోసం సస్పెండ్ చేసి బయటకు పంపించారని ఆయన పేర్కొన్నారు. మంద బలం ఉందని విర్రవీగుతున్న టిఆర్ఎస్ పార్టీ, సంఖ్యా బలం తక్కువగా ఉందని బిజెపి నేతలను సభ నుండి బయటకు పంపిందని, సభలో కేసీఆర్ బీజేపీ నేతలను బయటకు పంపామని వికటాట్టహాసం చేస్తున్నారని, అయితే కేసీఆర్ కు భవిష్యత్తులో ఇటువంటి అవమానం కచ్చితంగా ఎదురవుతుంది అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను చూసి నవ్వే రోజులు వస్తాయి
1997 లో ఒక ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వికటాట్టహాసం చేసిందని, అప్పుడు వాజ్ పేయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ని చూసి ఇలాగే నవ్వే రోజు వస్తుందని వ్యాఖ్యానించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నాడు వాజ్ పేయి చెప్పిన విషయాన్ని గుర్తు చేసిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ను చూసి ప్రజలు నవ్వే రోజులు వస్తాయని పేర్కొన్నారు.
దేశ శాసన వ్యవస్థలో నేడు బ్లాక్ డే
టిఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించే రోజులు వస్తాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. ముందు ముందు ప్రజలు టిఆర్ఎస్ కు బలం లేకుండా చేస్తారని, ఈ రోజు సభలో తాము ఎదుర్కొన్న అవమానం, భవిష్యత్తులో కెసిఆర్ కు ఎదురవుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. దేశ శాసన వ్యవస్థలో ఈ రోజు బ్లాక్ డే అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.