తీగ లాగుతున్న తెలంగాణ ఏసీబీ: ఏపీ, తెలంగాణల్లో గ్రీన్కో ఆఫీసులపై మెరుపుదాడి
KTR: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా ఇ-కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ను ఎదుర్కొంటోన్నారు మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను ఇచ్చింది. దీన్ని కొట్టివేస్తోన్నట్లు తెలిపింది. ఈ క్వాష్ పిటీషన్పై ఇదివరకే హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలను ఆలకించింది ఉన్నత న్యాయస్థానం. ఈ ఉదయం తుది ఉత్తర్వులు ఇచ్చింది. క్వాష్ పిటీషన్ కొట్టివేసింది.

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందినగర్లో ఉన్న తన నివాసంలో కేటీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తన లీగల్ టీమ్తో భేటీ అయ్యారు. సిద్ధార్థ్ దవే సహా కొందరు న్యాయ నిపుణుల సలహాలను స్వీకరిస్తోన్నట్లు సమాచారం.
అందుబాటులో ఉన్న కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. లీగల్ టీమ్తో పూర్తిస్థాయిలో సంప్రదింపులు నిర్వహించారు. క్వాష్ పిటీషన్పై సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై చర్చించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా? వద్దా? స్టే లభించే అవకాశం ఎంతవరకు ఉంది? అనే అంశంపై సమాలోచనలు జరిపారు.
సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వాదనలు ఎలా ఉండాలనే విషయంపై చర్చించారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులు తనకు వర్తిస్తాయా? లేదా? ఈ- ఫార్ములా కారు రేసుల చెల్లింపుల్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా తన ప్రమేయం ఎంతవరకు ఉంది?.. అనే అంశాలపై కేటీఆర్ తన లీగల్ టీమ్తో చర్చించినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో ఈ అవినీతి కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్ కంపెనీ కార్యాలయాలపై తెలంగాణ ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్ సహా, విజయవాడ, మచిలీపట్నంలల్లో గల గ్రీన్కో కార్యాలయాలు, సంబంధిత ఉన్నత ఉద్యోగుల ఇళ్లపైనా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
గ్రీన్కో ఎనర్జీకే చెందిన ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఆఫీసులపైనా దాడులు సాగుతున్నాయి. ఫార్ములా ఈ- రేస్కు స్పాన్సర్గా వ్యవహరించింది ఈ గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్ సంస్థ. కాకినాడ లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్కు చెందిన కంపెనీ.
ఫార్ములా ఈ-రేస్ అవినీతిలో ఈ సంస్థకూ ప్రమేయం ఉండొచ్చని తెలంగాణ ఏసీబీ అధికారులు అనుమానిస్తోన్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications