వందేభారత్ సిద్దం - హాల్ట్ ఈ స్టేషన్లలోనే : అప్ అండ్ డౌన్ వేర్వేరు రేట్లు..!!
తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకంగా వందేభారత్ వచ్చేసింది. నేడు ప్రధాని మోదీ వర్చ్యువల్ విధానం ప్రారంభించినా.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫారం (బోయిగూడ వైపు)పై ఈ రైలు ప్రారంభోత్సవానికి నిర్ణయించారు. ఈ రైలు రేపటి నుంచి ఇక వారంలో ఆరు రోజుల పాటుగా విశాఖ - సికింద్రాబాద్ - విశాఖమధ్య ప్రయాణం చేయనుంది. టికెట్ ధరలను అధికారులను వెల్లడించారు. ఇందులో రైలు ఆగే స్టేషన్లతో పాటుగా టికెట్ ధరల్లో మార్పులు..మినహాయింపుల గురించి స్పష్టత ఇచ్చారు.
వందేభారత్ టికెట్ ధరలు ఇలా
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి రిజర్వేషన్ ప్రారంభమైంది. విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైలుకు 20833 నంబర్, సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలుకు 20834 నంబర్ను కేటాయించారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలో హాల్ట్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైలు టికెట్ చార్జీల్లో అప్అండ్డౌన్ మార్గంలో వేర్వేరుగా ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్కు చైర్కార్ టికెట్ రేటు రూ.1720 ఉండగా, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ టికెట్ ధర రూ.3170 ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలులోని చైర్కార్ టికెట్ ధరను రూ.1665గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్కార్లో రూ.3,120గా ఉంది. విశాఖ నుంచి వచ్చే రైలులో చైర్కార్కు అదనంగా రూ.55, ఎగ్జిక్యూటివ్ చైర్కార్కు రూ.50 చెల్లించాల్సి వస్తోంది. టికెట్ చార్జీలతోపాటు కేటరింగ్కు సంబంధించిన రేట్లలోనూ మార్పు కనిపిస్తోంది.
అప్ అండ్ డౌన్ వేర్వేరు రేట్లు
రిజర్వేషన్ అందుబాటులోకి తెచ్చిన వేళ..టికెట్ల పైన నిర్ధారించిన ధరల్లో వెళ్లే సమయంలో ఒక విధంగా.. అదే విధంగా వచ్చే వేళ మరో రకంగా టికెట్ ధరలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ చైర్కార్ టికెట్లో బేస్ఫేర్ను రూ.1207గా నిర్ణయించారు. ఇందులో సూపర్ఫాస్ట్ చార్జీ రూ.45, రిజర్వేషన్ చార్జీ రూ.40 ఉంచారు. అన్నింటికీ కలిపి మొత్తం రూ.65 జీఎస్టీ గా పేర్కొన్నారు. రైళ్లలో అందించే ఆహార పదార్థాలకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.308 చొప్పున చార్జీ విధించనున్నారు. అయితే విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైలులో బేస్ చార్జీని మాత్రం రూ.1206గా పేర్కొన్నారు. ఇక్కడ కేటరింగ్ చార్జీని రూ.364 పెట్టడంతో టికెట్ ధరలో రూ.60 వ్యత్యాసం ఉంది. ద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలులోని ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో బేస్ఫేర్ను రూ.2,485 విధించారు. ఇందులో రిజర్వేషన్ చార్జీ రూ.60, సూపర్ఫాస్ట్ చార్జీ రూ.75, జీఎస్టీ రూ.131గా ఖరారు చేసారు. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైలులో కేటరింగ్కు రూ.50 అదనంగా తీసుకుంటూ రూ.419 గా వెబ్ సైట్ లో ధరలు కనిపిస్తున్నాయి.
ప్రయాణీకుడి ఆప్షన్ - మినహాయింపు ఇలా
వందేభారత్ లో ప్రయాణానికి వరంగల్ కు ఛైర్ కార్ రూ 520 కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ 1,005గా ఉంది. అదే విధంగా ఖమ్మం కు రూ 750, రూ 1,460గా నిర్ణయించారు. విజయవాడకు రూ 905, రూ 1,775 గా నిర్ధారించారు. రాజమండ్రికి రూ 1,365, రూ 2,485 గా ఉంది. చివరగా విశాఖకు రూ 1,665, రూ 3,120గా ఉంది. అదే విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఛైర్ కార్ రూ 1,720 కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ 3,170 గా నిర్ణయించారు. ఈ రైలులో ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారని, అందుకే రైలులో ఆహార పదార్థాల రేటులో వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. టికెట్ బుకింగ్ సమయంలోనే రైల్వే అందించే ఆహారం కావాలా ..వద్దా అనేది ప్రయాణీకుడు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వద్దనుకుంటే ఆ మేర టికెట్ ధరలో తగ్గింపు ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.