తెలంగాణకు చల్లని కబురు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పెరిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటోంది. పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా మొదలయ్యాయి. దీంతో ప్రజలు పగటిపూట ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా, వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. మార్చి నెలలోనే ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 21వ తేదీ నుంచి వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 21 నుంచి 25 వరకు మొత్తం ఐదు రోజులపాటు వానలు పడతాయని పేర్కొంది.

ఇక, నేటి నుంచి మూడు రోజులపాటు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటి వాతావరణంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొంది. ఈరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండనున్నాయి.. అయితే, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 18/03/2025@CEO_Telangana @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/94ddmSHGgC
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 18, 2025
కాగా, గత నెల రోజులుగా మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కురుస్తాయన్న వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుందని ఆశిస్తున్నారు. ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కొన్ని రోజులపాటైనా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
అయితే, మార్చి 25 తర్వాత మాత్రమం మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పగటిపూట అనవసరమైన ప్రయాణాలు చేయకుంటేనే మంచిదని వాతావరణ శాఖ అధికారులు, ఆరోగ్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. ఏవైనా పనులుంటే ఉదయం, సాయంత్రంపూట చేసుకోవాలంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పగటిపూట ప్రయాణం చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తమ వెంట తాగునీరు, గొడుగు లాంటి వాటిని తీసుకెళ్లాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications