రఘునందన్ రావుపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం...
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై గతంలో అత్యాచార ఆరోపణలు చేసిన రాజా రమణి మంగళవారం(నవంబర్ 17) ఆత్మహత్యాయత్నం చేశారు. ఆర్సీపురంలోని తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజా రమణికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఆత్మహత్యకు ముందు రాజా రమణి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అత్యాచారం కేసులో తనకు న్యాయం జరగట్లేదన్న ఆవేదనతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో తెలిపారు. అత్యాచార కేసులో 20 ఏళ్లుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగట్లేదని చెప్పారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇప్పటివరకూ రఘునందన్ రావును రిమాండ్ చేయలేదని అన్నారు. రూ.1కోటి ఖర్చు పెట్టి రఘునందన్ రావు బెయిల్ మంజూరు చేయించుకున్నాడని ఆరోపించారు.
స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రఘునందన్ రావును అరెస్ట్ చేస్తామని మాటిచ్చిన పోలీసులు... ఇప్పుడు దాని గురించి అడిగితే కోర్టులో పిటిషన్ వేసుకోమంటున్నారని చెప్పారు. ఇలా ఆర్సీ పురం పోలీసులు 20ఏళ్లుగా తనను,తన కుమారుడిని ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. తనకు న్యాయం జరగట్లేదన్న ఆవేదనతో,నిరసనతో ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video
కాగా,రఘునందన్ రావును ఓ కేసు విషయమై ఆశ్రయించగా.. కాఫీలో మత్తు మందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని రాజా రమణి గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు.