సిగ్గుచేటు! అంటూ కేంద్రంపై విమర్శలు: కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు గుప్పించిన రాకేష్ టికాయత్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రైతు సంఘం నేత రాకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సోమవారం దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతోపాటు రాకేష్ టికాయత్ కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల కోసం కేసీఆర్ సర్కారు అనేక మంచి పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గుచేటు: టికాయత్
ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. కేంద్రం విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ సీఎం చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు. రైతుల కోసం మమతాబెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్దతు ఉంటుందని రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు.

కేసీఆర్ సర్కారుపై రాకేష్ టికాయత్ ప్రశంసలు
సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13 నెలలపాటు ఉద్యమించామన్నారు తికాయత్. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తోంది. రూ. 6 వేలతో రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రైతుల కోసం కొట్లాడండి.. మేమే మీ వెంటే ఉంటాం.
రైతుల కోసం ఉద్యమించడానికి తెలంగాణకు కూడా వస్తాం. కనీస మద్దతు ధరపై ఏర్పాటైన కమిటీతో చర్చలు జరిపాం. కాలవ్యవధిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ కమిటీ నిరాకరించింది. రైతుల కోసం తెలంగాణ అనురిస్తున్న విధానాలు చాలా గొప్పవి. తెలంగాణలో అందిస్తున్న ఉచిత విద్యుత్ దేశమంతా అమలు చేయాలి.
విపక్ష సీఎంలు ఏకమై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మేము చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావు అని రాకేష్ టికాయత్ వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో రాకేష్ టికాయత్ కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడం గమనార్హం. కేసీఆర్ రైతు ద్రోహి అని అప్పుడు వ్యాఖ్యానించారు.

కేంద్రప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు, గుణపాఠం తప్పదు: నిరంజన్ రెడ్డి
టీఆర్ఎస్ నిరసన దీక్షలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రైతులకు నూకలు అలవాటు చేయాలని కేంద్రమంత్రి చెప్పారు. తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదు. కేంద్ర ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు.
ప్రజల మనసెరిగి పాలిస్తేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. నిరంజన్రెడ్డిరాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కేంద్రం ఢిల్లీకి రప్పించింది. ఢిల్లీలో రైతులు 13నెలలు ఉద్యమం చేస్తే కేంద్రం దిగి వచ్చింది. కేంద్రం ప్రజలను ఎంత కాలం మోసం చేయగలుగుతుంది. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications