నగరంలో రియల్ బూమ్: రికార్డు ధర, ఎకరం భూమి 29 కోట్లు
హైదరాబాద్: నగరంలో రియల్ బూమ్ పెరిగిపోయింది. హైదరాబాద్లో గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న రియల్ భూమ్ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ భాగ్యనగరానికి క్యూ కడుతుండటంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. గతంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ప్రభుత్వ భూములు రికార్డు ధరకు అమ్ముడుపోగా తాజాగా జరిగిన వేలంలో అదే ట్రెండ్ కొనసాగుతోంది.
తాజాగా నగరంలో టీఎస్ఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఇది మరోసారి బహిర్గతమైంది. నగర శివార్లలో ఎకరం భూమి రూ.28.91 కోట్లు పలికింది. ఇక రాజధానిలోనైతే ఏకంగా రూ.36.88 కోట్లు పలుకడం విశేషం. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) రెండో విడత భూముల వేలానికి గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు గురువారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ వేలంలో పలువురు వ్యక్తులు, సంస్థల నిర్వాహకులు అసక్తిగా పాల్గొన్నారు. కున్ మోటార్స్ సంస్థ ఎకరానికి 29 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు ఎకరాల భూమిని వేలంలో కొనుగోలు చేసింది. ఖానామెట్ లోనే మరో ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరాకు 18 కోట్ల 20 లక్షల ధర పలికింది.
గృహ అవసరాల కోసం షేక్ పేట్ లోని అల్ హమ్రా కాలనీలో 920 గజాల ప్రభుత్వ భూమి 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మిగతాచోట్ల నిర్వహించిన వేలంలో కూడా ప్రభుత్వ భూములు అత్యధిక ధరకు అమ్ముడు పోయాయి. నగరంలో రియల్ బూమ్ జోరందుకోవటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే నగరంలో రియల్ బూమ్ కు కారణమని చెబుతున్నారు. గతేడాది శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఎకరా భూమి రూ.28 కోట్లు పలుకడమే రికార్డుగా ప్రచారం జరిగింది. కాగా అప్పట్లో అరబిందో ఫార్మా కంపెనీ అత్యధిక ధరకు టీఎస్ఐఐసీ భూమిని కొనుగోలు చేసింది.

తాజా వేలం పాటలు ఆ రికార్డును కూడా తిరుగరాయడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోనూ ఎకరా రూ.1.89 కోట్లు పలుకడంతో అభివృద్ధి సూచి మరింతగా ఎగబాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఖానామెట్లో ఒకచోట ఎకరాకు రూ.28.91 కోట్లు వెచ్చించి కున్మోటర్ సంస్థ, మరోచోట రూ.18.20 కోట్లు పెట్టి యశోద హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్ భూమిని కొనుగోలు చేసింది. షేక్పేటలో ఎకరాకు రూ.36.88 కోట్ల ధరకు సయ్యద్అనీసుద్దీన్ 19 గుంటలు కొనుగోలు చేశారు.
కోకాపేటలో ఎకరా రూ.7.54కోట్లు పెట్టి గ్లాండ్జ్ బయోకెమికల్ కంపెనీ, మోకిలలో ఎకరా రూ.1.89 కోట్లు వెచ్చించి శ్రీనివాస్ అనే వారు బహిరంగ వేలం ద్వారా భూములు కొనుగోలు చేశారు. ఈ ఐదు ప్లాట్ల ద్వారా టీఎస్ఐఐసీకి రూ.171.22 కోట్లు సమకూరనున్నట్లు డిప్యూటీ కలెక్టర్ కే రాంబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications