కేటీఆర్ వద్దకు క్యూ కడుతున్న రియల్టర్లు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ టికెట్ల కోసం పోటీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు . టికెట్ల కోసం ఆశావహులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోటానికి తెగ తాపత్రయపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో మేయర్ సీటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఈ సీటును దక్కించుకునేందుకు భాగ్యనగరిలోని బడా రియల్టర్లు రంగంలోకి దిగుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల టార్గెట్ గా రియల్టర్లు
ఏపీలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్ లో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కేంద్రంగా జోరుగా ఉంటుందని భావిస్తున్న నేపధ్యంలో బిల్డర్లు, వ్యాపారవేత్తలు సైతం హైదరాబాద్ పరిధిలోని మేయర్, మున్సిపల్ చైర్మన్ల సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్ తోపాటు నగర శివారు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఇటీవల కాలంలో రియల్ భూమ్ బాగా పెరిగింది . హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం 7 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రియల్టర్ల కన్ను ఎన్నికల మీద పడింది.
ఏపీ ప్రభావంతో హైదరాబాద్లో రియల్ భూమ్
అస్మదీయులకు టికెట్లు ఇప్పించుకుంటే భవిష్యత్ లో వ్యాపారానికి ఇబ్బంది ఉండదు అన్న భావన వ్యక్తం అవుతుంది. అమరావతి రాజధాని మార్పుతో హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో ఎలాగైనా సరే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకుంటే తమ పంట పండుతుందని అందరూ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది . ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో తీవ్ర పోటీ నెలకొన్న నేపధ్యంలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు టికెట్ల వ్యవహారాలను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు.
టికెట్ల కోసం కేటీఆర్ దగ్గరకు క్యూ కడుతున్న రియల్ వ్యాపారులు
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పరిచయాల ద్వారా ఆయనను సంప్రదించడానికి బడా రియల్టర్లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.హైదరాబాద్ శివారు జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ, బడంగ్ పేట, బోడుప్పల్ కార్పొరేషన్లలో టికెట్ల కోసం కేటీఆర్ వద్ద పెద్ద పోటీ నెలకొంది. ఆశావహులు ముఖ్యంగా బిల్డర్లు క్యూ కడుతున్నారు. తాజాగా ఫీర్జాదిగూడ కార్పొరేషన్ అభ్యర్థిగా ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ బిల్డర్ పోటీ లో ఉండనున్నారు. ఇక ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి కేటీఆర్ ఖరారు చేశారని తెలుస్తుంది. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపధ్యంలో కేటీఆర్ అభ్యర్థులను ఆచి తూచి ఎంపిక చేస్తున్నట్టు సమాచారం .