రేణుకా చౌదరి భూముల్లో ఎర్ర జెండాలు పాతిన సిపిఎం శ్రేణులు
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని బిసిఎం రోడ్డు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి భూముల్లో సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు.ట ఆ భూముల్లోనే కాకుండా చెరువు బంజరు, మేడికుంట చెరువు భూముల్లో కూడా ఎర్రజెండాలు పాతారు.
రేణుకా చౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం స్థాపించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి 43 ఎకరాల భూమి తీసుకున్నారని, ఇప్పటి వరకు కర్మాగారం స్థాపించలేదని, పైగా ఆ భూముల్లో మామిడితోటలు వేశారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య చెప్పారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ కాళీచరణ్ ఎస్. కర్టేడ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో భూములను సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఇదిలావుంటే, రేణుకా చౌదరి చాలా కాలంగా ఖమ్మం జిల్లా కాంగ్రెసు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.