విడుదల కాని తెలుగువారు: హైదరాబాద్కు చేరుకున్న కన్నడ ప్రొఫెసర్లు
హైదరాబాద్: లిబియాలో కరడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) చెర నుంచి బయటపడిన ప్రొఫెసర్లు లక్ష్మీకాంత్, విజయ్లు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. లిబియాలోని సిర్టే వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు భారతీయులను ట్రిపోలీ, టునిస్ మీదుగా భారత్కు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో కారులో వస్తుండగా సిర్టే పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్పోస్ట్ వద్ద వీరిని ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్కుమార్లను విడుదల చేశారు.
మూడు రోజుల క్రితం ఐఎస్ చెర నుంచి బయటపడిన వారు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి మరి కాసేపట్లో తమ సొంత రాష్ట్రం కర్ణాటకకు బయలుదేరనున్నారు.
వీరితో పాటు ఉగ్రవాదుల అపహణరకు గురైన తెలుగువారు గోపికృష్ణ, బలరాం ఇంకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించేందుకు కృషి చేయాల్సిందిగా అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
భారత్కు చెందిన నలుగురిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఇద్దరిని వదిలిపెట్టి మరో ఇద్దరిని తమ వద్ద బందీలుగు ఎందుకు ఉంచుకున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. భారతీయుల కిడ్నాప్ అంశంపై ట్రిపోలీలోని భారత మిషన్ అధిపతిని సంప్రదించామని విదేశాంగ శాఖ వర్గాలు చెప్పాయి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ ఓయూలో పీహెచ్డీ చేసి ఏడేళ్ల క్రితం లిబియాకు వెళ్లి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గోపీకృష్ణ భార్య కళ్యాణి, కుమారుడు కృష్ణసాయి ఈశ్వర్(4), కుమార్తె జాహ్నవి(10)లతో కలిసి నాచారంలోని వీరారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.
కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన సి.హెచ్.బలరాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్డీ చేశారు. లిబియాలో సిర్తే వర్సిటీలో పనిచేయడానికి వెళ్లారు. ఆయన భార్య పిల్లలు శ్రీదేవి, విజయ్భాస్కర్, మధుసూధన్ అల్వాల్లోని సుభాష్నగర్లో నివాసముంటున్నారు.