వస్తూనే రేవంత్ దూకుడు: కేసీఆర్, హరీశ్లపై కేసులు పెట్టాలంటూ పిలుపు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో హైకోర్టు కల్పించిన వెసులుబాటుతో హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్పై దూకుడు ప్రదర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న హత్యలని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
బుధవారం హైదరాబాద్లో ట్యాంక్బండ్ వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటుంబాన్ని గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై కేసులు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు రైతులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. సరిగా ప్రభుత్వం పట్టించుకుని, రైతులకు భరోసా ఇస్తే తెలంగాణలో 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదని రేవంత్ తెలిపారు.
ఇక వ్యవసాయశాఖ మంత్రి అయితే నడవలేని స్థితిలో వైద్యం తీసుకుంటున్నారని, ఆయన గురించి ఏం మాట్లాడినా ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని చనిపోతున్న రైతు కుటుంబాలకు కనీసం రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో కోర్టు ఆదేశాల మేరకు నిన్నటి వరకు తన సొంత నియోజక వర్గం కొడంగల్కే పరిమితమైన రేవంత్ రెడ్డి ఈరోజు నగరానికి చేరుకున్నారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో చేరుకున్న రేవండ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్కు వచ్చీ రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పదునైన విమర్శలు చేశారు. మధ్యాహ్నాం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పైన పోరాటం ఆపేది లేదని చెప్పారు. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం అంతు చూస్తానని హెచ్చరించారు.
రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తనకు ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ తనతో పాటు చైనా పర్యటనకు సభాపతిని తీసుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించే అధికారం జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్కు ఎవరిచ్చారని నిలదీశారు.
తెలంగాణలో ఆట మొదలైందని కేసీఆర్ అన్నారని, ప్రారంభమైనది ఆట కాదని, వేట మొదలైందన్నారు. బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని అన్నారు.