రేవంత్ ప్రమాణం ఆలస్యం ! ట్రాఫిక్ లో అతిధులు- గవర్నర్ కూ తప్పని కష్టాలు!
ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎంగా మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా అనుకోని కారణాల వల్ల ఆలస్యం జరిగిపోయింది. దీంతో గవర్నర్ వచ్చాక ఈ కార్యక్రమం ప్రారంభించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ వల్ల అతిధులు చాలా మంది నిర్ణీత సమయానికి హాజరుకాలేకపోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున కాంగ్రెస్ నేతల్ని, సీఎంలను, మాజీ సీఎంలను, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా భారీగా తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియానికి వచ్చే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.
ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ గవర్నర్ తమిళిసై కానీ, మరికొందరు ప్రముఖులు కానీ ఎల్బీ స్టేడియానికి చేరుకోలేకపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. భారీ ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు ఎలాగోలా వీఐపీలు ఒక్కొక్కరిని స్టేడియానికి చేరేలా చూశారు. చివరికి గవర్నర్ 1.20 సమయంలో హడావిడిగా స్టేడియానికి చేరుకుని రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.












Click it and Unblock the Notifications