కౌశిక్ రెడ్డి వ్యవహారం ముందే తెలుసన్న రేవంత్ రెడ్డి .. లీగల్ నోటీసులు పంపిన మణిక్కం ఠాగూర్
తెలంగాణ రాజకీయాలలో కౌశిక్ రెడ్డి వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుండి తనకు టికెట్ ఇస్తున్నట్లుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావటంతో తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. శరవేగంగా చోటుచేసుకున్న పరిణామాలలో భాగంగా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆ వెనువెంటనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మణిక్కం ఠాగూర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తో పాటు రాజీనామా చేసి టిఆర్ఎస్ బాటపట్టారు.

పాడి కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపిన మణిక్కం ఠాగూర్
ఇక తాజాగా ఏఐసిసి ఇంచార్జి మణిక్కం ఠాగూర్ తనపై చేసిన ఆరోపణలపై పాడి కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి కొనుక్కున్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టబోతున్నాడు అంటూ విమర్శించారు. ఈ క్రమంలో తనపై చేసిన ఆరోపణలకు వారంరోజుల్లో బేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసు లో పేర్కొన్నారు మణిక్కం ఠాగూర్.

కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్
ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనపై కేసులు అసంబద్ధ ఆరోపణలను వదిలేది లేదని తేల్చి చెప్పారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వకుంటే ఒక కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యవహారం తనకు ముందే తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గం లో మంచి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తో టచ్ లో ఉన్నాడని తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డి వ్యవహారం ముందే తెలుసన్న రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ నుండి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా వారికి అభ్యర్థి కరువయ్యాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి చెందిన, అలాగే బిజెపికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తో టచ్ లోకి వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని వెల్లడించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను వదిలిపెట్టం అని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications