సింగరేణి ప్రమాద ఘటన: కొనసాగుతున్న రెస్క్యూ; సమగ్ర విచారణకు రేవంత్ రెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గనిలో సోమవారం చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలి : రేవంత్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు పనిలో ఉన్న సమయంలో భూగర్భ గనిలో పైకప్పు కూలి పోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సింగరేణి గని కూలిన ప్రమాద ఘటనపై స్పందించిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

గని కప్పు వారం రోజుల క్రితం స్వల్పంగా కూలినా పట్టించుకోలేదని ఆరోపణ
వారం రోజుల క్రితమే గని పైకప్పు స్వల్పంగా కూలిందని, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుల్ని గనిలోకి అనుమతించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అధికారుల తప్పిదం కారణంగా నలుగురు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్మికుల భద్రతకు యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

బొగ్గుగని పైకప్పు కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఇదిలా ఉంటే సింగరేణి బొగ్గు గని పైకప్పు కూలిన ప్రమాద ఘటన పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులు రక్షించడం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, తగిన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. మరోవైపు కూలిన శిథిలాల నుంచి కార్మికులు బయటకు తీసుకురావడానికి చర్యలు ముమ్మరం చేశామని, రక్షణ చర్యలు చేపట్టామని సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు వెల్లడించారు.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, శిధిలాలలో చిక్కుకున్న వారిపై ఆందోళన
ఇదిలా ఉంటే సింగరేణి గనుల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం గనిలో నుంచి రవీందర్ ను బయటకు తీసుకు రావడంతో రవీందర్ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా శిథిలాలలో చిక్కుకున్న ముగ్గురుని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గనిలో చిక్కుకుపోయిన తేజ, జయరాజ్, శ్రీకాంత్ కోసం గాలింపు కొనసాగుతోంది.
Recommended Video

కుటుంబ సభ్యుల జాడ తెలియక కార్మిక కుటుంబాల ఆందోళన
ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంకా వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమ వారిని క్షేమంగా రక్షించి తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం గదిలోపల చిక్కుకున్న వారి మాటలు వినిపిస్తున్నట్టుగా సమాచారం. నీరు ఆహారం లేకపోవడంతో పాటు, శిధిలాలలో చిక్కుకుపోవడంతో వారి పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications