జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు ; ప్రగతి భవన్ లో ఆ జీవో .. సీఎం జగన్ కు కేసీఆర్ గిఫ్ట్ : రేవంత్ సెన్సేషన్
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పార్టీలలో కొత్త చర్చకు కారణమవుతోంది. నిన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణానది యాజమాన్య బోర్డు వ్యవహరించిందని తెలంగాణ అధికారులు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
YSR Death Anniversary: వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, వైయస్ షర్మిల(ఫోటోలు)
జగన్ కు కేసీఆర్ లొంగిపోయారు .. నిన్న మీటింగ్ ద్వారా అర్ధం అయ్యింది ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లొంగిపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే కృష్ణా నది యాజమాన్య బోర్డు మీటింగ్ కు కూడా కెసిఆర్ వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదంపై నిన్న జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి 2015లో కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని, కానీ అందులో ఆ ఒప్పందం ఏడాదికే అని స్పష్టంగా రాసి ఉందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం దాన్ని పొడిగించుకుంటూ వెళ్లారని దీని వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు.
మోదీతో రహస్య ఒప్పందం .. అందుకే గెజిట్ పై సైలెంట్
తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ చేస్తున్న మోసం మరోమారు నిరూపణ అయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని రహస్యంగా టీఆర్ఎస్ ఎంపీలు కలిసి వచ్చారని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కేంద్రం జారీ చేసిన గెజిట్ పై కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. నీటి పంపకాల్లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ద్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కృష్ణ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణా ప్రజల నీటి హక్కులను తాకట్టు పెట్టిన కేసీఆర్
తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టాడని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. గతేడాది మే 5న 203 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు నీటి తరలింపును నాలుగు టీఎంసీల నుండి ఏడు టీఎంసీలకు పెంచారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మూడు టీఎంసీలు తరలించేందుకు అనుమతి కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కేవలం తన స్వప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ తెలంగాణా జల వివాదాలపై గట్టిగా పోరాటం చెయ్యటం లేదని అభిప్రాయపడ్డారు.
ప్రగతి భవన్ లో జీవో .. జగన్ కు గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్
ప్రగతి భవన్లో కేసీఆర్ రోజూ అదనంగా 11 టిఎంసిల నీటిని ఏపీకి ఇవ్వడం కోసం ఒక జీవో తయారు చేసి జగన్ కు కానుకగా ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కూడా దీనిపై కెసిఆర్ కు లేఖ రాశారని, ఆంధ్ర ప్రదేశ్ 30రోజుల్లో 330 టిఎంసిల నీరు తరలించుకుపోతే శ్రీశైలం నష్ట పోతుందని, నాగార్జునసాగర్ నిరుపయోగంగా మారుతుందని హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ అవేవి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్, సీఎం జగన్ లు కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి కెసిఆర్ వైఖరి వల్ల తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందని ఆరోపించారు .