రిషికేశ్వరి మృతి: ప్రిన్సిపల్ బాగోతం వీడియో, గర్ల్స్తో చిందు, బలవంతంగా నైట్పార్టీ
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో వరంగల్ జిల్లాకు చెందిన రిషికేశ్వరి మృతి నేపథ్యంలో ఆర్కిటెక్చర్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ బాబురావ్ బాగోతాలు ఒక్కటొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పలువురు విద్యార్థులు గురువారం నాడు బాబురావుకు చెందిన వీడియోలు విడుదల చేశారు.
అందులో బాబురావ్ వర్సిటీ అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి చిందులు వేశారు. కొందరు సీనియర్లను అడ్డుగా పెట్టుకునేవాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లేట్ నైట్ పార్టీలకు రావాలని...
తనతో లేట్ నైట్ పార్టీలకు రావాలని పలువురు అమ్మాయిల పైన ఒత్తిడి తెచ్చేవాడని ఆరోపిస్తున్నారు. కొందరు అమ్మాయిలతో రేవ్ పార్టీలకు వెళ్లేవాడని తెలుస్తోంది. గతంలో ఆయన పైన పలుమార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా ట్రాప్..
కొందరు సీనియర్లను తన వైపుకు మళ్లించుకొని అమ్మాయిలను వ్యూహాత్మకంగా ట్రాప్ చేసేవాడని ఆరోపిస్తున్నారు. వారి ద్వారా విద్యార్థినీలను లొంగదీసుకుంటున్నాడని అంటున్నారు. వర్సిటీలో ఆయన వల్లనే సమస్య అవుతోందని ఆరోపిస్తున్నారు.
రేవ్ పార్టీలకు, నైట్ పార్టీలకు తమను ఆహ్వానిస్తున్నారని గతంలో పలు ఫిర్యాదులు ప్రిన్సిపల్ పైన వెల్లువెత్తాయని తెలుస్తోంది. కళాశాలలో ర్యాగింగ్ మాఫియానే తయారయిందని అంటున్నారు. కొందరు సీనియర్లతో కలిసి జూనియర్ అమ్మాయిలను టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబురావుకు రాజకీయ అండ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 15 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. కుల రాజకీయాలు కూడా కారణంగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు.