ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, 21 మందికి గాయాలు
మెదక్: కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద టాటా ఏస్ను ఎదురెదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
పిట్లం మండలం చిల్లర్గికి చెందిన 26 మంది టాటాఏస్లో సంతకెళ్లి ఇంటి కొస్తున్నారు. ఈ క్రమంలో పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు ధాన్యం లోడుతో వెళ్లున్న లారీ హసన్పల్లి గేట్ వద్ద టాటా ఏస్ను బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
క్యాబిన్లోనే చిక్కుపోయిన డ్రైవర్ను అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.
21 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో డ్రైవర్ సాయిలు, లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్య చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులంతా చిల్లర్గి గ్రామానికి చెందిన సమీప బంధువులుగా తెలిపారు. ఎల్లారెడ్డిలో జరుగుతున్న సంతకు వెళ్లివస్తున్నారని చెప్పారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.