సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని ముగ్గురు యువకులు మృతి!!
తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే నేడు సంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందారు.
ఆందోల్ మండలం మాసాన్ పల్లి శివారులోని నాందేడ్- అఖోలా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. నిన్న అర్ధరాత్రి జోగిపేట నుంచి కారులో ఆరుగురు యువకులు టీ తాగడానికి బయటకు వచ్చారు.

చౌటకూర్ దాబా దగ్గరకు వెళ్లిన యువకులు అది మూసి ఉండడంతో, అదే కారులో మాసాన్ పల్లి వద్ద హైవే పక్కన హోటల్ కు వెళ్లి టీ తాగారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మాసాన్ పల్లి వంతెన కింద టాయిలెట్ కు వెళ్లేందుకు కారు ఆపి దిగిన సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణమని తెలుస్తుంది. ముగ్గురు యువకుల ప్రాణాలను హరించిన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ఇక ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు యువకులు 22 సంవత్సరాల ముకురం, 26 సంవత్సరాల హాజీ, 28 సంవత్సరాల వాజిద్ గా గుర్తించారు. ఇక ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications