స్మృతి ఇరానీపై భగ్గు: పరిపాలనా బాధ్యతలకు దళిత టీచర్లు దూరం (పిక్చర్స్)
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) భగ్గుమంది. పది మంది దళిత అధ్యాపకులు పరిపాలనాపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు.
ఐదుగురు దళిత విద్యార్థుల బహిష్కరణపై విచారణ జరుపుతున్న కమిటీలో ఆ పది మంది ఉన్నారు. నిజానికి వారు పదవులకు రాజీనామా చేద్దామని అనుకున్నారు. కానీ, తాము రాజీనామా చేస్తే దళిత విద్యార్థులకు మద్దతు ఉండదనే ఉద్దేశంతో వారు ఆ ఆలోచనను విరమించుకుని పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
మంత్రి స్మృతి ఇరానీ దేశాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని, విశ్వవిద్యాలయ స్థాపన నుంచి కార్యనిర్వాహక మండలిలో దళితులకు ప్రాతినిధ్యం లేదని, అందువల్ల తాము పరిపాలనా బాధ్యతల్లో కొనసాగదలుచుకోలేదని విద్యార్థుల సంక్షేమ విభాగం డీన్, ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల అధికారుల వేదిక సభ్యుడు ప్రకాష్ బాబు అన్నారు.
తాము అధ్యాపక వృత్తిలో ఉండడం ద్వారా పాలనా విభాగంపై ఒత్తిడి తేగలమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయంలోని పరిపాలనా నిర్వహణ పదవుల్లో ఉన్న దళితుల నైతిక స్థయిర్యాన్ని స్మృతి ఇరానీ దెబ్బ తీస్తున్నారని అధ్యాపకులు ఓ ప్రకటనలో అన్నారు.
కార్యనిర్వాహణ మండలి అగ్రవర్ణానికి చెందిన ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ నేతృత్వం వహిస్తున్నారని, సబ్ కమిటీ దళిత అధ్యాపకులు ఎవరూ లేరని ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల, అధికారుల వేదిక ఓ ప్రకటనలో విమర్శించింది. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారంనాడు రెండో రోజుకు చేరుకుంది.

అట్టుడుకుతున్న విశ్వవిద్యాలయం
రోహిత్ ఆత్మహత్య ఘటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. దళిత విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.

దిష్టిబొమ్మలు దగ్ధం
విశ్వవిద్యాలయం ఆవరణలో స్మృతి ఇరానీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రోహిత్ మృతిపై విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది.

మోడీకి వ్యతిరేకంగా నినాదాలు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. నలుగురు విద్యార్తులపై వేసిన బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసనల హోరా
రోహిత్ ఆత్మహత్యకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపాయి.

విద్యార్థుల బైఠాయింపు
విద్యార్థులు పెద్ద యెత్తున చేరుకుని పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి, వీసి అప్పారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మానవ హారం
పరిపాలనా భవనం వద్ద విద్యార్థులు మానవ హారం నిర్వహించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

వారిని ఎత్తేశారు..
పరిపాలనా భవం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు తొలగించడానికి విశ్వప్రయత్నం చేశారు.

విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత
స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications