రోహిత్ ఆత్మహత్య: స్మృతిపై ధ్వజమెత్తుతున్న జాతీయ నేతలు, ఎన్సీపీ ర్యాలీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విషయంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు. ఆమె అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్సి సురవరం సుధాకర్ రెడ్డి మోడి ప్రభుత్వంపైనా, స్మృతి ఇరానీపై తీవ్ర విమర్శలు చేశారు. స్మృతి నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. స్మృతీ ఇరానీ బండారు దత్తాత్రేయలను తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

వేముల రోహిత్ ఆత్మహత్య కేసును పక్కదోవ పట్టించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతోపాటు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని ఆయన గురువారంనాడు డిమాండ్ చేశారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులు కల్పించిన ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్థుల వ్యవహారాన్ని స్మృతీ ఇరానీ నిస్సిగ్గుగా పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు.
దేశ ప్రజలకు మంత్రి పచ్చి అబద్దాలు చెప్పారని, అసలు విషయాన్ని దాచిపేట్టేందుకు ప్రయత్నించారని దాన్ని బట్టే మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టంగా అర్థమవుతోందని రణదీప్ సూర్జేవాలా అన్నారు.
ఎన్సీపీ ర్యాలీ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం ర్యాలీ నిర్వహించింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ మండిపడింది. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications