పంచాయతీ కార్యాలయానికి షాక్: ఒక్క నెలకే రూ. 11.41 కోట్ల కరెంట్ బిల్లు, ఎక్కడంటే?
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ. 11,41,63,672 విద్యుత్ బిల్లు వేశారు.
హైదరాబాద్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఏకంగా రూ. కోట్లలో కరెంటు బిల్లు వచ్చింది. అది కూడా ఒక నెల బిల్లే కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ. 11,41,63,672 విద్యుత్ బిల్లు వేశారు.
ఈ విద్యుత్ బిల్లును చూసిన సర్పంచ్, కార్యదర్శి షాకయ్యారు. కోట్ల రూపాయల్లో కరెంటు బిల్లు రావడం ఏంటని ఖంగుతిన్నారు. గ్రామస్తులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి, సర్పంచ్.. విద్యుత్ అధికారులను ఈ బిల్లు విషయమై నిలదీశారు. ఇంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే.. విద్యుత్ అధికారులు ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపడం ఏంటని మండిపడుతున్నారు. వెంటనే సరైన బిల్లును పంపించాలని కోరారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పంచాయతీ కార్యాలయానికి రూ. కోట్లలో విద్యుత్ బిల్లు వచ్చిందని గ్రాస్తులు కూడా మండిపడుతున్నారు. ఈ విషయంపై మాచారెడ్డి ఏఈ వెంకటరమణను వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగానే విద్యుత్ బిల్లు రూ. కోట్లలో వచ్చిందని, ఉన్నతాధికారుల సహకారంతో బిల్లును పునరుద్ధరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications