కలర్ జిరాక్స్ చేసిన రూ.2వేల నోటుతో మోసం
మహబూబాబాద్: జిల్లాలోని కురవిలో కలర్ జిరాక్స్ చేసిన రూ.2000 నోటును పెట్రోలు బంకులో మార్పిడి చేయబోయాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడ్ని ఆదివారం పోలీసులకు అప్పగించారు పెట్రోలు బంకు సిబ్బంది.
వివరాల్లోకి వెళితే.. కురవి మండలం తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన ప్రదీప్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని కొత్తగా వచ్చిన రూ.2వేల నోటును పోలిన నకిలీ నోటును ఇవ్వడంతో బంకు సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు.
నకిలీ నోటు తెచ్చిన యుకుడితోపాటు అతనికి ఆ నోటు ఇచ్చిన మోద్గులగూడెం శివారు తండాకు చెందిన అతని సోదరుడు అనిల్ను కూ మహబూబాబాద్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు యువకులను విచారించిన తర్వాత ఈ నకిలీ నోటుకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నకిలీ నోట్ల తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.