ఆర్టీసీ కార్మికులు రైట్ రైట్ అంటే...యాజమాన్యం హోల్డ్ ఆన్ అంటుందే...ఏం జరగబోతుంది?
తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ముగిస్తున్నట్లు ప్రకటించిన కార్మిక జేఏసీ మంగళవారం నుండి విధులకు హాజరుకావాలని రైట్ రైట్ అంటూ ప్రకటన చేసింది. ఇక విధులకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్న నేపథ్యంలో, మేం చెప్పినప్పుడు విధుల్లోకి రాలేదు కాబట్టి, ఇప్పుడు చేర్చుకునేది లేదు, లేబర్ కమిషనర్ నిర్ణయం తర్వాత పరిస్థితిని ఆలోచిద్దామని,హోల్డ్ ఆన్ అని ఆర్టీసీ యాజమాన్యం గట్టిగానే చెబుతోంది. మంగళవారం నుంచి విధులలో ఉండాలని ఆర్టీసీ కార్మికులు,అంత సీన్ లేదని ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న నేపథ్యంలో నేడు పరిస్థితి ఏవిధంగా ఉండబోతుంది అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది.
విధుల్లో చేరతామంటున్న కార్మికులు .. చేర్చుకోము అంటున్న ఆర్టీసీ
52 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు కార్మిక సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు గా ప్రకటించేశారు. ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తాము సమ్మెను విరమిస్తున్నట్లు గా పేర్కొన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. అంతేకాకుండా మంగళవారం నుంచి విధుల్లోకి వస్తామని కూడా ప్రటించేశారు. ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చారు . తమ మాట వినకుండా విధులకు హాజరు కాకుండా 52 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పేశారు.
ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకున్నా సమ్మె విరమించిన కార్మిక లోకం
అంతేకాకుండా విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కార్మికులను విధుల్లోకి ఎలా తీసుకుంటామని కూడా తెలంగాణ సర్కార్ సంచలన ప్రకటన చేసి, ఆర్టీసీ కార్మిక లోకాన్ని షాక్ కు గురి చేసింది.ఏపీలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు యాభై రెండు రోజులపాటు సమ్మె చేసి, చివరకు ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే సమ్మె విరమించారు. నేటి నుండి విధుల్లో చేరి పని చేస్తామని చెప్పారు.
మంగళవారం విధుల్లో చేరాలని కార్మికుల భావన .. డిపోల వద్దకు రాకుండా పోలీసుల గట్టి భద్రత
మంగళవారం నాడు అందరు డిపోలకు వెళ్లి విధుల్లో చేరాలని పిలుపునిచ్చింది ఆర్టీసీ కార్మిక జెఎసి. ఇక ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోమని తేల్చి చెబుతోంది ఆర్టీసీ. దీంతో నేడు డిపో వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికులను డిపోల వద్దకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకున్నా,విలీనం చేస్తామని ప్రకటన చేయకున్నా ఆర్టీసీ కార్మికులు సమ్మెను పూర్తిగా విరమిస్తున్నట్లు ప్రకటించారు.
బెట్టు వీడని సర్కార్ .. ప్రశ్నార్ధకంగా 48 వేల మంది కార్మికుల పరిస్థితి
ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కార్ ఆలోచనతో, ఆర్టీసీని రక్షించుకోవడం బాధ్యతగా భావించి విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం బెట్టు వీడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీంతో 48 వేల మంది కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కార్మిక కుటుంబాల ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ప్రాణాలు పోయినా, పోరాటం చేసినా జరగని న్యాయం
పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నా,తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు అలుపెరుగని పోరాటం చేసినా చివరకు విజయం సాధించింది మాత్రం సర్కార్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడు జయాపజయాల విషయం పక్కన పెడితే ఆర్టీసీ కార్మికుల బతుకు భరోసా కు గ్యారెంటీ లేకుండా పోయింది. కేంద్ర చట్టం తోనే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేశామని మెలిక పెడుతూ ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు విధుల్లోకి తీసుకోబోమని తేల్చి చెబుతోంది తెలంగాణా సర్కార్ . ఇక ఆర్టీసీ కార్మికుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే వీలు లేకుండా మెలిక పెడుతుంది.
ఆర్టీసీ కార్మికులు నేడు ఏం చేస్తారనే ఉత్కంఠ
ఇన్నాళ్ల కార్మిక పోరాటం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇక దీంతో నేడు తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్న కార్మికులు ఏం చేయబోతున్నారు అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనప్పటికీ మొదటి నుండి మొండి తనానికి ప్రతీకగా ఉన్న సీఎం కేసీఆర్ తన మొండితనాన్ని ఈ సమయంలో కూడా కొనసాగించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సీఎం కేసీఆర్ నిరంకుశ విధానానికి నిదర్శనమని భావిస్తున్నా ఆర్టీసీ కార్మిక లోకం చేష్టలుడిగి చూస్తోంది. నేడు విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్న కార్మికలోకం,చేర్చుకునేదే లేదు అని తేల్చి చెబుతున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఈ నేపథ్యంలో కార్మికులు తీసుకోబోయే స్టెప్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.