ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మరో 2 థియేటర్లు.. ఈ నెలలోనే ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే వార్త. సినిమా థియేటర్స్ కు అడ్డాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న విషయం తెలిసిందే. నగరంలోని చాలామంది ఇక్కడి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమా చూసేందుకు ఇష్టపడతారు. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోనే పేరుగాంచిన సినిమా హాల్స్ ఉన్నాయి. సంధ్య 70 ఎంఎం, 35 ఎంఎం అలాగే సుదర్శన్ 35 ఎంఎం, దేవి 70 ఎంఎం, సప్తగిరి 70 ఎంఎం థియేటర్స్ ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కలిపింతే ఈ ఏరియాలో దాదాపు 18 సినిమా థియేటర్లు ఉన్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయితే ఇక్కడ రిలీజైతే రికార్డు కలెక్షన్స్ రావాల్సిందే. సినిమా రికార్డులు ఒకెత్తు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు మరొకెత్తు అనే విధంగా ఫ్యాన్స్ లెక్కలేసుకుంటారు.
అయితే మూవీ లవర్స్ ను మరింతగా ఆకట్టుకునేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మరో రెండు మల్టీప్లెక్స్ లు రానున్నాయి. ఓడియన్ మల్టీప్లెక్స్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. ఇందులో 8 స్క్రీన్లు ఉండనున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రారంభం కానుంది. ఈ థియేటర్ వచ్చే ఏడాది సంక్రాంతికి 7 స్క్రీన్ లతో ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఓడియన్ థియేటర్ మల్టీప్లెక్స్ గా మారనున్న నేపథ్యంలో ఇక్కడ మూవీతోపాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు.

ఇక ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు థియేటర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తదితరులు ఉన్నారు. ఇటీవల వనస్థలిపురంలో రవితేజకు చెందిన ఏఆర్టీ సినిమాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోనే తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ సినిమాస్ కూడా ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications